కీర్తి సురేశ్ జాతీయ స్థాయిలో అవార్డ్ అందుకున్నా, నంబర్ గేమ్లో మాత్రం వెనకబడే ఉంది. పూజా హెగ్డే, రష్మిక మందన్న టాప్ చైర్ కోసం పోటీ పడుతోంటే.. కీర్తి మాత్రం ఇంకా రేసుకి దూరంగానే ఉంది. ఇలాంటి సమయంలో 'సర్కారు వారి పాట'లో మహేశ్ బాబుతో జోడీ కట్టే అవకాశమొచ్చింది. ఇక సూపర్స్టార్ మూవీతో కీర్తీ నంబర్గేమ్లో ముందుకెళ్తుందని ఆమె అభిమానులు అంతా అనుకున్నారు. కానీ కీర్తి మాత్రం స్టార్ లీగ్ లెక్కలు పక్కనపెట్టి వైవిధ్యమైన సినిమాలు చేస్తోంది.
కీర్తీ సురేశ్ ప్రస్తుతం చిరంజీవితో 'భోళా శంకర్' సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది కీర్తి. అలాగే తమిళ్లో దర్శకుడు సెల్వరాఘవన్తో కలిసి 'సానికాయిదమ్' అనే సినిమా చేస్తోంది. ఈ మూవీలో సెల్వరాఘవన్ చెల్లెలిగా నటిస్తోంది కీర్తి. అలాగే తర్వాత కమెడియన్ వడివేలు లీడ్ రోల్ ప్లే చేస్తోన్న 'మామన్నన్' లో ఒక ప్రధాన పాత్ర పోషిస్తోంది కీర్తి. ఇటీవలే ఈ సినిమా లాంచ్ అయ్యింది.
హీరోయిన్గా కెరీర్ మంచి పీక్లో ఉన్నప్పుడు ఎవరూ సిస్టర్ క్యారెక్టర్స్ చేయరు. కమెడియన్స్ లీడ్ రోల్ చేస్తోన్న సినిమాలని అస్సలు టచ్ చెయ్యరు. కానీ కీర్తి సురేశ్ మాత్రం సిస్టర్ రోల్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనే తేడా లేకుండా చాలెంజింగ్ రోల్స్ అనిపిస్తే చాలు కాల్షీట్స్ ఇచ్చేస్తోంది. దీంతో కీర్తి టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందా అనే సందేహంలో పడిపోయారు మహానటి అభిమానులు.
చూద్దాం.. మహానటి కీర్తి సురేశ్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాలనిస్తాయో.