శ్రుతి హాసన్‌ మల్టీటాలెంటెడ్‌ అనే విషయం మనకు బాగా తెలిసిందే. నటిగా మాత్రమే కాకుండా గాయనిగానూ తన ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆమె నుండి ఎలాంటి సింగిల్స్‌/సాంగ్స్‌ అయితే రాలేదు.


కరోనా పరిస్థితుల వల్లనో, లేక ఇంకేం కారణమో కానీ.. ఆమె నుండి పాటలు అయితే రాలేదు. తాజాగా శ్రుతి హాసన్‌ మ్యూజిక్‌ మ్యాజిక్‌ ఒకటి చేసింది. 'షీ ఈజ్‌ హీరో' అంటూ ఓ పాటను విడుదల చేసిందట . యూట్యూబ్‌లో ఈ పాట ఇప్పుడు తెగ సంచలనంగా మారింది.


'షీ ఈజ్‌ ఏ హీరో' అంటూ సాగే గీతాన్ని ఎంసీ అల్తాఫ్‌తో కలసి శ్రుతి హాసన్‌ ఆలపించింది. నిత్య జీవితంలో సగటు మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఈ పాట సాగింది. ''ఓ మహిళగా ప్రస్తుతం, గతం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటూనే ఉంటాను. మహిళలు అందరికీ ఈ పాటను అంకితమిస్తున్నాం. ఈ పాటకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పాట నచ్చితే నేను నటిస్తున్న సినిమాల్లోనూ పాట పాడతాను'' అంటూ ఈ పాటను షేర్‌ చేస్తూ రాసుకొచ్చిందట శ్రుతి.


 


కరణ్‌ కంచన్‌, కరణ్‌ పారిక్‌ స్వరపరిచిన ఈ గీతాన్ని శ్రుతి హాసన్‌, ఎంసీ అల్తాఫ్‌ ఆలపించారు. ర్యాప్‌, ఎమోషనల్‌ సింగింగ్‌తో పాట అదిరిపోయింది అని చెప్పొచ్చు. బ్లాక్‌ అండ్‌ వైట్ కాంబినేషన్‌లో పాటను చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. మహిళల సమస్యల్ని వివరించే విధానం బాగుంది. శ్రుతి, అల్తాఫ్‌ కలసి ఈ పాటను రచించారు. నిరంజన్‌ అయ్యంగర్‌ అందించిన అదనపు లిరిక్స్‌ కూడా భావోద్వేగాన్ని పెంచేలా ఉన్నాయని సంగీత ప్రియులు, మహిళల హక్కుల మీద ఉద్యమం చేస్తున్నవాళ్లు కామెంట్స్‌ చేస్తున్నారు.


శిక్షా సేవా ఫౌండేషన్‌ ఈ వీడియోను రూపొందించింది. ఇక శ్రుతి సినిమాల సంగతి చూస్తే.. మూడు సినిమాల్లో నటిస్తోందట . ప్రభాస్‌ 'సలార్‌', చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 107వ సినిమాలో శ్రుతి నటిస్తోందట. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అని చెబుతున్నారు. వాటి విషయం త్వరలో తేలనుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: