చిత్ర పరిశ్రమలో కొన్ని అరుదైన కాంబినేషన్లలో వచ్చే చిత్రాలు ఇంకా చర్చల్లో ఉండగానే ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇలాంటి కాంబోలో చిత్రం వస్తే బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డుల మోత మోగడం ఖాయమని సినీ ప్రియులు మాత్రమే కాదు.. చిత్ర పరిశ్రమ వర్గాలు సైతం ముందుగానే ఫిక్స్ అయిపోతారు. టాలీవుడ్లో ప్రస్తుతం అలాంటి క్రేజీ ప్రాజెక్టే దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబోలో తొలిసారిగా తెరకెక్కబోతున్న చిత్రం. ఈ చిత్రం పట్టాలెక్కేందుకు ఇంకా చాలా సమయమే ఉన్నా, ఇప్పటికే దీనిపై అటు ఇండస్ట్రీలోను ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోను ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
నిజానికి మహేష్- జక్కన్న కాంబోలో చిత్రం ఎప్పుడో ప్రేక్షకులను అలరించాల్సి ఉన్నా, రాజమౌళి బాహుబలి సిరీస్ చిత్రాలకు సంవత్సరాల తరబడి కేటాయించాల్సి రావడంతో వాయిదా పడుతూ వచ్చింది. బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్త సంచలన విజయం తరువాత జక్కన్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే క్రేజీ డైరెక్టర్గా మారిపోయాడు. మరోపక్క మహేష్ కూడా శ్రీమంతుడు, భరత్ అను నేను, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ విజయాలతో తెలుగునాట తిరుగులేని సూపర్ స్టార్గా ఎదిగాడు.
ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వచ్చే చిత్రమంటే అది ఏం రేంజ్లో తెరకెక్కుతుందో ఊహించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే. `ఆర్ఆర్ఆర్` తర్వాత జక్కన్న తెరకెక్కించబోయే మహేష్ ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు ప్రారంభమయ్యాయి. కాగా ఈ చిత్రం ఎలాంటి కథతో రూపుదిద్దుకోనుందనే విషయంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ జేమ్స్బాండ్ తరహా చిత్రాలను తెలుగు తెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన వారసుడిగా వెలుగొందుతున్న మహేష్ కూడా రాజమౌళి చిత్రంలో బాండ్ తరహా పాత్రలోనే నటించవచ్చంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జక్కన్న ఈ అంశంపై మాట్లాడుతూ `మహేష్తో సినిమా ఎలా ఉంటుందనేది నాకు కూడా తెలీదు. మహేష్తో కూడా కథ గురించి చర్చ జరగలేదు. మహేష్ ఇమేజ్కు అనుగుణంగా, నా అభిరుచికి తగినట్టుగా ఆ సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు. అంతేకాదు. `ఆర్ఆర్ఆర్` తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు మొదలు పెడతానని స్పష్టం చేశాడు. అంటే ఈ సూపర్ కాంబో కోసం సినీప్రియులు ఇంకా కొంతకాలం ఆగక తప్పదన్నమాట.