
స్టార్ హీరో కమల్ హాసన్ ఎన్నో సహాయాలు చేసినా ఆ సహాయాలను చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఎంతోమందికి కమల్ విద్యా దానం చేయడం ద్వారా పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక పేద విద్యార్థిని ఉన్నత విద్య కోసం కమల్ సహాయం చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. శోభన అనే మత్స్యకార కుటుంబానికి చెందిన విద్యార్థిని ప్లస్2 పరీక్షల్లో 562 మార్కులు సాధించడం గమనార్హం.
శోభన తల్లి పీతలు ఎగుమతి చేసే కంపెనీలో రోజువారీ కూలీగా పని చేస్తున్నారు. అయితే శోభన తాను చదివే ప్రభుత్వ కాలేజ్ లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలనే ఉన్నత లక్ష్యాన్ని ఈమె నిర్దేశించుకున్నారు. అయితే ఆర్థిక సమస్యల వల్ల ఆమె ఒక బట్టల దుకాణంలో పనికి చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయాలు సోషల్ మీడియా ద్వారా కమల్ హాసన్ దృష్టికి రాగా శొభనను తన కార్యాలయానికి పిలిపించి ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులకు సంబంధించి సాయం చేశారు. కమల్ హాసన్ ను ఈ విషయంలో ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. కమల్ హాసన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. కమల్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. థగ్ లైఫ్ సినిమాతో కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.