తెలుగు సినీ పరిశ్రమలో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ మరోసారి తమ దూరదృష్టిని నిరూపించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పూర్తిగా తెలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ పైనే దృష్టి పెట్టిన ఈ సంస్థ, తొలిసారి నాన్-తెలుగు సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయాలని ముందుకు వచ్చింది. మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘EKO’ కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుని, నవంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.


కేరళ పర్వత ప్రాంతాల్లో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో సందీప్ ప్రదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అతనితో పాటు వినీత్, నరైన్, బిను పప్పు, అశోకన్, బియానా మొమిన్, సిమ్ జీ ఫీ, హుంగ్ షెన్, సహీర్ మొహమ్మద్, రంజిత్ శేఖర్ వంటి బహుభాషా నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించగా, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ—.. బహుల్ రమేష్ స్వయంగా చేపట్టడం ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఆరాద్యా స్టూడియోస్ బ్యానర్‌పై ఎంఆర్‌కే జయరామ్ నిర్మించిన ఈ చిత్రానికి ముజీబ్ మాజీడ్ సంగీతాన్ని అందించారు.



ఈ ప్రత్యేక భాగస్వామ్యంపై స్పందించిన అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియా యార్లగడ్డ మాట్లాడుతూ— “EKO వంటి సినిమాలు కొత్త ఆలోచనలను, విభిన్న కంటెంట్‌ను ప్రోత్సహించాలనే మా నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి. మలయాళ చిత్రాన్ని తొలిసారిగా డిస్ట్రిబ్యూట్ చేయడం మా కోసం ఎంతో ముఖ్యమైన సందర్భం. ఏపీ, టీఎస్ ప్రేక్షకులకు ఈ థ్రిల్లర్‌ను అందించడం పట్ల మాకు నిజంగా ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, విస్తరిస్తున్న పాన్-ఇండియా మార్కెట్ దృష్ట్యా అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకున్న ఈ ముందడుగు తెలుగు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్గా భావించబడుతోంది. విభిన్న భాషల మంచి సినిమాలను తెలుగువారికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో కొత్త దారులు చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: