అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన ఘటన ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాజమౌళి ఇటీవల గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ రాష్ట్రీయ వానరసేన సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.


ఎం జరిగింది? ఎందుకు వివాదం?

మహేశ్ బాబు హీరోగా, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం “వారణాసి”కి సంబంధించిన టైటిల్ లాంచ్ ఈవెంట్ రెండు రోజుల క్రితం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నపాటి సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈవెంట్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ పరిస్థితుల్లో రాజమౌళి కొంత భావోద్వేగానికి గురయ్యారని అక్కడున్నవారు చెబుతున్నారు.అప్పట్లో తన తండ్రి చెప్పిన ఒక సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. “నా నాన్న ఒకసారి ‘హనుమంతుడు నీ వెనక నిలబడి నిన్ను నడిపిస్తాడు’ అని అన్నాడు. ఆ మాట నాకు అప్పట్లో కోపం తెప్పించింది. నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆయనను తన స్నేహితుడిలా భావిస్తుంది. అదే సమయంలో ఆమెపై కూడా కోపం వచ్చిందనిపించింది. హనుమంతుడు నిజంగా ఇలానేనా చేస్తాడా అని అనిపించింది,” అని రాజమౌళి ఆ ఈవెంట్‌లో చెప్పారు.



ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ వ్యాఖ్యలు హనుమంతుడిని అవమానించేలా ఉన్నాయంటూ, ఎనభై లక్షల మంది భక్తుల భావాలను దెబ్బతీశాయంటూ, సంబంధిత సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రాథమిక కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు రాజమౌళిని సమర్థిస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలను అభ్యంతరకరంగా పేర్కొంటున్నారు. కేసు నమోదు కావడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: