శాసనసభలో మార్షల్స్ తమను బూటు కాళ్లతో తన్నారని, తీవ్రంగా గాయపరిచారని ప్రతిపక్షనేత, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. శాసనసభ నుంచి గెంటివేతకు గురైన అనంతరం స్టాలిన్ సచివాలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. స్టాలిన్ అక్కడి నుంచి రాజ్భవన్కు వెళ్లి తమిళనాడు ఇన్ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. చిరిగిన చొక్కాతోనే ఆయన గవర్నర్ ముందు కూర్చొని అసెంబ్లీలో జరిగిన తీరుని వివరించారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించారని, తనను బలవంతంగా బయటకు పంపించారని తెలిపారు.
స్టాలిన్ ఆరోపణ నేపథ్యంలో డీఎంకే వర్గీయులు పెద్దస్థాయిలో రాజ్భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. స్టాలిన్పై సభలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ నినాదాలు చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జయ సమాధి సాక్షిగా శశికళ చేసిన శపథం నెరవేరింది. తన వర్గానికి చెందిన పళని సీఎం కావడంతో, బలపరీక్షలో కూడా పళని నెగ్గడంతో శశికళ ఆనందానికి అవధుల్లేవు. సుప్రీం తీర్పుతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో కటకటాలు లెక్కిస్తున్న శశికళ నిన్న తమిళనాడులో జరిగిన పరిణామాలను టీవీలో వీక్షించారు.
పళని బల పరీక్ష నెగ్గగానే ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సమయంలో శశికళ పళనికి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. శనివారం అసెంబ్లీలో జరిగిన ప్రతీ సీన్ను శశికళ టీవీలో వీక్షించారు. పళని నెగ్గగానే ఆమె గదికి తిరిగెళ్లారు. ఆయనకు ఫోన్ చేసి దాదాపు 7 గంటల వరకూ మాట్లాడారు. కొందరు న్యాయ నిపుణులతో కూడా శశికళ సంప్రదింపులు జరిపారు. తనకు ఏ క్లాస్ గదిని కేటాయించేలా చూడాలని ఆమె న్యాయనిపుణులకు సూచించారు.