"పనామా పేపర్స్" దెబ్బకు పొరుగుదేశం పాకిస్థాన్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కుప్పకూలటమే కాదు ఆయన కుటుంబసభ్యులలో ఎక్కువమందిపై విచారణై నేరనిర్ధారణ జరిగి శిక్షలు పడ్డాయి. అయితే భారత్ లో మాత్రం ఇంకా దానిపై తాత్సారం నడుస్తుంది. పనామా పేపర్స్ అలజడి పూర్తిగా కనుమరుగై జన దృష్టి నుంచి తొలగి మర్చిపోకముందే కొత్తగా వెలుగులోకి వచ్చింది "పారడైజ్ పేపర్స్"

ఇందులో, దేశ వ్యాప్తంగా పన్ను ఎగ్గొట్టిన 714 మంది భారతీయుల పేర్లు వున్నాయి. రాజకీయ, సినీమా, బిజినెస్, పారిశ్రామిక, అధికార ఇలా అన్ని వర్గాలకు చెందినవాళ్లు ప్యారడైజ్ పేపర్స్ లో వున్నారు. అమితాబ్, సంజయ్దత్ భార్య మాన్యత, కేంద్రమంత్రి జయంత్ సిన్హా, కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా, విజయ్ మాల్యా, వై ఎస్ జగన్ మొహన్ రెడ్డి తోపాటు ఇంకా చాలామంది పేర్లున్నాయి. ఇప్పుడు వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అంటున్నారు.

తమ పేరు బయటకు వస్తే ఏం చెయ్యాలి? ఏ విధంగా వివరణ ఇవ్వాలి అన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసి ఈనెల ఎనిమిదికి ఏడాది పూర్తవుతున్న సందర్భం గా ప్రభుత్వం "నల్లధన వ్యతిరేఖ దినం" (యాంటీ-బ్లాక్ మనీ డే) పాటిస్తోంది. దీనికి రెండురోజుల ముందే పారడైజ్ పేపర్స్ లీకేజీ సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 180 దేశాల కు చెందిన వారి డేటా లీక్ కాగా, అందులో భారత్ 19వ స్థానంలో నిలిచింది.

ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) 13.4 మిలియన్ పేపర్లను లీక్ చేసింది. గతంలో పనామా పేపర్స్ను లీక్ చేసింది కూడా ఐసీఐజేనే! పన్నుల నుంచి తప్పించు కునేందుకు తమ ఆస్తులను ఎలా దాచుకున్నదీ ఈ పేపర్లలో వివరించింది. పనామా పేపర్స్ లీకేజీ తర్వాత "ప్రపంచంలోనే అతిపెద్ద డేటా లీకేజీల్లో ప్యారడైజ్ పేపర్స్" రెండోదని అంటున్నారు.
అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ఒక బిజినెస్ అసోసియేట్ ద్వారా ఈ నిధులను తరలించినట్టు "లీకైన" డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఈ జాబితాలో నైక్, ఫేస్బుక్ వంటి సంస్థలతోపాటు బ్రిటన్ రాణి ప్రస్తావన కూడా ఉండడం కలకలం సృష్టిస్తోంది. క్వీన్ ఎలిజబెత్, ప్రైవేట్ ఎస్టేట్ ద్వారా రహస్యంగా 10మిలియన్ పౌండ్ల (రూ. 84 కోట్లు)ను తరలించి విదేశాల్లో పెట్టుబడి చేసినట్టు తెలుస్తోంది. పన్నుల నుంచి తప్పించు కునేందుకు వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. ఈ పారడైజ్ పేపర్స్ వ్యవహారాన్ని "ది ఇండియన్ ఎక్స్ప్రెస్" అనే వైబ్సైట్ రాసుకొచ్చింది.

అమితాబ్ ఆవేదన:
నా జీవితంలో మిగిలి ఉన్న కొన్నేళ్లు నేను నాతోనే గడపాలనుకుంటున్నాను. ఈ వయసులో నాకు ప్రశాంతత కావాలి. నా పేరు హెడ్ లైన్స్ లో వచ్చినా తాను పట్టించుకోను. ఈ వ్యాఖ్యలు చేసింది బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్యారడైజ్ పత్రాల జాబితాలో తన పేరు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో బిగ్ బీ తన బ్లాగులో ఇలా స్పందించారు.
అక్రమ కట్టడాలు, ఆస్తుల విషయాల్లో తనకు నోటీసులు అందాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఒక్కోసారి వీటిపై వివరణ ఇవ్వాలనిపిస్తుందని, మరోసారి అసలు స్పందించక పోతే ఎలాంటి గొడవ ఉండదనిపిస్తుందని అమితాబ్ వ్యాఖ్యానించారు.
స్కాంలలో ఇరుకున్నామంటూ కొన్నేళ్లుగా తన కుటుంబం గురించి వస్తున్న వార్తలు చూసి చాలా బాధపడ్డామని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. విచారణలో భాగంగా తమ సమాధానాలు అడుగుతున్నారని, ఇప్పటివరకు రెండు సమాధానాలు ఇచ్చామని, తమ పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారని, ఇలాంటి కేసుల్లో తాము నిందితులుగా లేమని తాము ఇచ్చిన సమాధానాలు పత్రికల్లో వచ్చిన తర్వాత కూడా ప్రశ్నల వర్షం ఆగలేదని ఆయన బ్లాగ్ లో పేర్కొన్నారు.
ఈ వయసులో తనకు ప్రశాంతత కావాలని, తన జీవితంలో మిగిలి ఉన్న కొన్నేళ్లు తన తోనే తాను గడపాలనుకుంటున్నానని, తన పేరు హెడ్ లైన్స్ లో వచ్చినా తాను పట్టించుకోనని ఆయన స్పష్టంచేశారు. ప్యారడైజ్ పత్రాల్లోనే కాదు, గతంలో అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపిన పనామా పేపర్స్, బోఫోర్స్ కుంభకోణం వంటి వాటిలో కూడా అమితాబ్ పేరు బయటకు వచ్చింది.
