రోజురోజుకు ప్రేమ పేరుతో మహిళలను వంచిస్తున్న మృగాలు ఎక్కువై పోతున్నారు. ఆడపిల్లలను  ఆట బొమ్మల్లా  చూస్తూ దారుణంగా మోసాలకు పాల్పడుతున్నారు, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెళ్లి పేరుతో లొంగదీసుకుని ఆ తర్వాత ముఖం చాటేసి మహిళలను మోసం చేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే తెరమీదకు వస్తున్నాయి, తాజాగా ఇలాంటి ఓ దారుణ ఘటన జరిగింది. షాద్ నగర్ పట్టణానికి చెందిన వడ్ల అఖిల్.. అదే ప్రాంతానికి చెందిన శ్రీవాణి అనే యువతిని ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. నువ్వు లేకపోతే బతకలేను... నువ్వే సర్వస్వం అంటూ ఎన్నో మాయమాటలు చెప్పాడు.



ఇక ఇలా మాయ మాటలు చెబుతూ ఆ యువతి మనసును కరిగించాడు. నిజంగానే నిజాయితీగా ప్రేమిస్తున్నాడేమో అనుకొని నమ్మిన ఆ యువతి  యువకుడిని ప్రేమించేందుకు అంగీకరించింది. ఇక ఆ తర్వాత శ్రీ వాణి పెళ్లి చేసుకుందాం అని కోరగా.. ఎవరికీ తెలియకుండానే గుట్టుగా  పెళ్లి చేసుకున్నారు. తర్వాత శ్రీవాణిని  హాస్టల్ లో ఉంచుతూ కాలం గడుపుతూ వచ్చాడు అఖిల్. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకి శ్రీవాణి గర్భం దాల్చింది, ఇక శ్రీవాణి గర్భం దాల్చడంతో షాక్ అయిన అఖిల్ ఈ విషయంపై శ్రీవాణి తో  పలుమార్లు గొడవపడ్డాడు. అబార్షన్ చేయించుకోవాలని అంటూ ఒత్తిడి తీసుకు వచ్చాడు.



 దీంతో అనుమానం వచ్చిన శ్రీవాణి తాను హాస్టల్లో ఉండలేనని వెంటనే మీ ఇంటికి తీసుకెళ్ళు అంటూ అఖిల్ పై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో హాస్టల్ నుండి మకాం మర్చి  షాద్ నగర్ లో ఒక గది అద్దెకి తీసుకుని అక్కడ కాపురం ప్రారంభించాడు. శ్రీవాణిలో  మరింత అనుమానం పెరిగి పోయింది. మీ  ఇంటికి తీసుకెళ్తావా లేదా అని అఖిల్ ను  నిలదీసింది. అయితే సమాధానం దాటవేసిన అఖిల్.. శ్రీవాణి పై  బెదిరింపులకు దిగాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన శ్రీ వాణి ఏకంగా పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి బాధిత యువతికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: