అధికారిక సమాచారం ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 60లక్షలకు చేరువైంది. వీరిలో ఇప్పటివరకు 94వేల మంది మృత్యవాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు, ఫ్రంట్ వారియర్స్ సైతం కరోనా కాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా కేంద్ర పోలీసు బలగాలు వైరస్ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు పోలీసు బలగాల్లో దాదాపు 36వేల మందికి వైరస్ సోకినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీరిలో 128 మంది మృత్యువాతపడ్డట్లు తాజా నివేదిక స్పష్టంచేసింది. ముఖ్యంగా సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎన్ఎస్జీతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వైరస్ బారినపడినవారిలో ఉన్నారు.
అయితే, వైరస్ సోకిన కేంద్ర పోలీసుల్లో 52మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, బీఎస్ఎఫ్లో 29, సీఐఎస్ఎఫ్లో 28మంది చనిపోయారు. ఐటీబీపీ, ఎస్ఎస్బీలలో తొమ్మిది మంది చొప్పున కరోనా సోకి ప్రాణాలు కోల్పాయారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ కేంద్ర పోలీసు బలగాలు మాత్రం విధుల్లోనే నిమగ్నమయ్యాయి. సెలవులు ముగించుకొని తిరిగి విధులకు హాజరయ్యే పోలీసులను కచ్చితంగా క్వారంటైన్లో ఉంచుతున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా వైరస్ సోకిన వారికి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని హోం శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.