అమ్మకాలు ఇలా తగ్గాయి..
ధరల పెరుగుదలకు ముందు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ధరలు పెరిగిన తర్వాత మే 19 నుంచి మే 28 వరకు 10రోజుల వ్యవధిలో కేవలం 3.6 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అంటే 40 వేల కేసుల వరకు బీర్ల అమ్మకాలు తగ్గాయని అర్థమవుతోంది. ఇక గ్రేటర్ పరిధిలో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగాయి. ఇక్కడ కూడా బీర్ల అమ్మకాలు తగ్గాయి. రంగారెడ్డి జిల్లాలో ధరల పెంపుకి ముందు 1.86 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. ధరల పెంపు తర్వాత 1.84 లక్షల కేసుల మద్యం అమ్ముడుపోయింది. అంటే మద్యం అమ్మకాలు స్వల్పంగా తగ్గాయని తెలుస్తోంది.
హైదరాబాద్, మేడ్చల్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలో కూడా ధరల పెంపు ప్రభావం అమ్మకాలపై కనపడుతోంది. పెరిగిన ధరల కారణంగా మద్యం వినియోగం కొంత మేరకు తగ్గిందని వైన్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. వేసవి ప్రభావం ఇంకా తగ్గకపోయినా బీర్ల అమ్మకాలు మాత్రం తగ్గాయి. వేసవిలో బీర్ల అమ్మకాలు పెరుగుతూ పోవాలి కానీ, ఇలా తగ్గడమేంటని ఆశ్చర్యపోతున్నారు.
మరోవైపు లిక్కర్ ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గాయి, అమ్ముడుపోయిన కేసుల సంఖ్య తగ్గింది.. అయితే అదే సమయంలో సర్కారుకి ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. మే 8వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాలలో మద్యం అమ్మకాల ద్వారా రూ.315 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. మే 19నుంచి మే 28 వరకు పది రోజుల వ్యవధిలో రూ.351 కోట్లకు ఆదాయం పెరిగింది.