ఎనిమిది సంవత్సరాల పాటు ఎన్నో వాదోపవాదనలు దేశవ్యాప్తంగా ఎన్నో చర్చోపచర్చలు కొత్త చట్టాలకు కారణమైన నిర్భయ దోషులకు ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరి శిక్ష వేశారు. భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకేసారి నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి అయ్యింది. ఉరిశిక్ష అమలుకు ముందు నలుగురు దోషులకు ఉదయం నాలుగు గంటలకు అల్పాహారం అందించారు. అనంతరం నలుగురు డాక్టర్లు వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒక గంటసేపు వారిని ప్రశాంతంగా వదిలేశారు. ఇక తమకు మరికొద్ది నిమిషాల్లోనే ఉరిశిక్ష అమలు కానుందని తెలియడంతో వినయ్ శర్మ బోరున ఏడ్చేసినట్టు తెలిసింది.
అనంతరం ఉరి శిక్ష అమలు చేశారు. తిహార్ జైలు లోని మూడవ నెంబర్ గదిలో వీరి నలుగురికీ మీరట్ నుంచి వచ్చిన తలారి ఉరిశిక్ష అమలు చేశారు. ఒక్కో దోషి వెంట మొత్తం 12 మంది గార్డులతో మొత్తం 48 మంది భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏదేమైనా న్యాయం గెలిచిందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరు వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఒకేసారి నలుగురు దోషులకు ఉరి శిక్ష వేసిన వ్యక్తిగా తలారి పవన్ జల్లాద్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
ఉరి శిక్ష అమలు చేసే సమయంలో జైలు సూపరిండెంట్, డిప్యూటీ సూపరిండెంట్, మెడికల్ ఇన్చార్జ్ ఆఫీసర్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, జిల్లా మెజిస్ట్రేట్తో పాటు పలువురు పోలీసులు అక్కడ బందోబస్తుగా ఉన్నారు. ఇక అరగంట పాటు నలుగురు నిందితుల మృత దేహాలు ఉరి కంబానికి వేలాడ నున్నాయి. అనంతరం నలుగురు దోషుల మృతదేహాలు దింపి వారి వారి స్వస్థలాలకు తరలించ నున్నారు. ఇక ఉరికి ముందు రోజు అర్ధరాత్రి వరకు కూడా పెద్ద హైడ్రామానే నడిచింది. ఈ రోజు సాయంత్రమే వీరి మృత దేహాలకు అంత్య క్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.