గత వందేళ్ల రికార్డ్ ని మూసీ నది వరద తిరగరాసింది. గతంలో ఎప్పుడూ లేనంతగా మూసీలో వరదనీరు పారింది. ఇటీవల కాలంలో మూసీలో నీరు లేకపోవడంతో.. ఆక్రమణలు ఎక్కువయ్యాయి. అధికారులు కూడా చూసీ చూడనట్టు ఉండటంతో.. నదీ గర్భంలోకి కూడా కట్టడాలు వెళ్లిపోయాయి. అలాంటి వారంతా ఈ వరదల్లో గూడు కోల్పోయారు. మూసీ వరదల విషయం బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనే ఉందని, అదే ఇప్పుడు జరుగుతోందని, హైదరాబాద్ కి మరింత ప్రమాదం పొంచి ఉందని ప్రచారం జరుగుతోంది.
వందేళ్లలో ఎన్నడూ చూడని వర్షం హైదరాబాద్ ని నిండా ముంచగా, శనివారం అదే సీన్ రిపీటైంది. వర్షం మళ్లీ హడలెత్తించింది. ఉరుములు, మెరుపులతో కూడిన క్యుములోనింబస్ మేఘాల తీవ్రతతో శనివారం రాత్రి హైదరా బాద్ మళ్లీ వణికిపోయింది. మంగళ, బుధ వారాల్లో కురిసిన రికార్డు వర్షం తాలూకు వరదతో కాలనీలు ఇంకా తేరుకోకముందే వరుణుడు పగబట్టిన రీతిలో... మళ్లీ ఆ ప్రాంతాల్లోనే శనివారం సైతం కుండపోతగా వర్షం కురిసింది. సాయంత్రం ఆరు గంటల నుండి హయత్నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్ పేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్ – విజయవాడ ప్రధాన రహ దారితో పాటు నగరంలోని రహదారులు పూర్తిగా జలమయమై ఈ రెండు రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చినుకుపడితేనే గజగజ వణుకుతు న్న నగరవాసులు ఇంటికి చేరేందుకు తొందరపడ టంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పాతబస్తీలోని ఛత్రినాకలో వరదనీటిలో పలు వాహనాలు మళ్లీ కొట్టుకుపోయాయి. ఫలక్నుమా రైల్వే బ్రిడ్జి పైభాగంలో భారీ గొయ్యి పడటంతో బ్రిడ్జిని మొత్తం మూసేశారు. పాతబస్తీ బాబానగర్ పరిధిలో ని గుర్రంచెరువు గండి మరింత పెద్దది కావటంతో వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే ఉప్పల్, ఎల్బీ నగర్, అంబర్పేట ప్రాంతాల్లో నాలుగు రోజులుగా వరదనీటిలోనే మునిగిన కాలనీల్లో శనివారం నాటి వర్షం పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చింది.
మూడు రోజుల నుంచి వర్షం లేకపోవ డంతో వరద తగ్గుముఖం పడుతుందని భావించి ఊపిరిపీల్చుకునే లోపే మరోసారి వరదనీరు ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు హిమాయత్సాగర్లోకి భారీగా వస్తుండటంతో శనివారం రాత్రి మరో మూడు గేట్లు ఎత్తి వేశారు. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరించారు. వర్షం దంచికొట్టడంతో మరోసారి పాతబస్తీ అతలాకుతలమైంది. గుర్రం చెరువు వరద నీరు పాతబస్తీని ముంచె త్తింది. మళ్లీ కాలనీలు నీటమునగడంతో మూలి గే నక్క మీద తాటిపండు పడ్డట్లు తయారైంది పరిస్థితి. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.