హైదరాబాదులో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇక ప్రియుడి మృతి తట్టుకోలేకపోయిన ప్రియురాలు చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నిండిపోయింది. హైదరాబాద్ నగరంలోని నాగోల్ ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన సుస్మిత పారిపోయి నగరానికి వచ్చి బోడుప్పల్ లో హాస్టల్ లో ఉంటుంది. ఇక నాగోల్ సమీప మల్లికార్జున నగర్ కు చెందిన కళ్యాణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి వీరి పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ల వరకూ ప్రేమలో మునిగితేలిన ఈ ప్రేమజంట తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇంట్లో పెద్దలకు వీరి ప్రేమ విషయం చెప్పడంతో మొదట అంగీకరించకపోయినా తరువాత ఒప్పుకొని పెళ్లి చేసేందుకు అంగీకరించారు. ఇక పెద్దల సమక్షంలోనే ఈ జంట ఆగస్టులో నిశ్చితార్థం కూడా చేసుకుని పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయించారు. అయితే మరో రెండు రోజుల్లో పెళ్లి జరగబోతుంది అనుకుంటున్న తరుణంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో కళ్యాణ్ మృతి చెందడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నా తరుణంలో వరుడు దూరం కావడంతో సుస్మిత జీర్ణించుకోలేక పోయింది. చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.