న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్ ప్రపంచ దేశాలతో అన్ని విధాలుగాను పోటీపడుతోంది. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయారీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటి వరకు కేవలం 5 దేశాలు మాత్రమే తయారు చేశాయి. వాటిలో భారత్ కూడా ఒకటి. దీనిని బట్టి భారత్ ఎంత వేగంగా అభివృద్ది చెందుతుందో అంచనా వేయొచ్చు. అయితే తాజాగా దేశ రక్షణ విషయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత రక్షణను మరింత పటిష్టం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.


ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లలో దేశ రక్షణను పెంచేందుకు కావలసిన పరిశోధన, ఆవిష్కరణల కోసం దాదాపు రూ.499 కోట్ల బడ్జెట్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యంతో దాదాపు 300 అంకుర సంస్థలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యక్తిగత ఆవిష్కర్తలకు కావలసిన ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందిస్తుందని తెలిపారు. దీని ద్వారా దేశంలో సొంత తయారీ గణనీయంగా పెరుగుతుందని రక్షణ శాఖ అభిప్రాయపడుతోంది.



ఇందులో భాగంగా దేశ రక్షణ శాఖకు కావలసిన ఆయుధాలు, సైనిక ఉత్పతుల దిగుమతులను తగ్గించాలని, భారత దేశాన్ని ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వ అధికారులు ఈ బడ్జెట్‌కు అమోదం తెలిపారు. భారత రక్షణను పెంచడంతో పాటు, మేడ్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికీ ఈ నిధులు దోహదం చేస్తాయని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ప్రొడక్షన్‌-డీడీపీ’ ఆధ్వర్యంలో ‘డిఫెన్స్‌ ఇన్నోవేషన్‌ ఆర్గనైజేషన్‌-డీఐఓ’ ఏర్పాటు చేసి దాని ద్వారా ‘ఇన్నోవేషన్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌-ఐడెక్స్‌’ అమలు చేయనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ,  ఏరోస్పేస్‌ రంగంలో స్వావలంబన సాధించడమే ‘ఐడెక్స్‌-డీఐఓ’ లక్ష్యమని.. దాని కోసమే తాజాగా కేటాయిచిన రూ.499 కోట్ల  నిధులను వినియోగించనున్నట్లు తెలిపింది. ఆవిష్కర్తలు డీడీపీతో అనుసంధానమయ్యేందుకు డీఐఓ వారధిగా నిలవనుందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: