సాధారణంగా రాజకీయాలలో ప్రతి పక్షంలో ఉన్న నాయకులు పదే పదే అధికార పార్టీపై విమర్శలు చేయడం చూస్తూ ఉంటాము. కొన్ని విమర్శల్లో వాస్తవం ఉన్నప్పటికీ, ఎక్కువగా విమర్శలు మాత్రం కావాలనే ఏదో ఒక విధంగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికి, ప్రజల ముందు పార్టీని ప్రశ్నార్థకంగా మార్చే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు అందులో భాగంగానే ఏపీలో ప్రతి పక్ష పార్టీ అయిన టీడీపీ  నాయకుడు నారా లోకేష్ అధికార పార్టీపై గత కొద్ది రోజుల నుండి విమర్శనాస్త్రాలు సందిస్తూ ఉన్నాడు. తాజాగా లోకేష్ ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ కు ఏపీ ప్రభుత్వం ఏపిపిఎస్సి లో చేసిన పొరపాట్ల గురించి లెటర్ రాయడం జరిగింది. ముఖ్యంగా ఏపిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్ పరీక్షల్లో పాటించిన వేల్యూష‌న్ విధానంపై పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రత్యేకంగా గవర్నర్ కు రాసిన లేఖలో పొందుపరిచారు. ఈ విషయంపై స్పందించి అభ్యర్థులకు న్యాయం చెయ్యాలని లోకేష్ కోరడమైనది.

అంతే కాకుండా ఈ ఏపిపిఎస్సి నిర్వహణ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని వీటన్నింటిపై గవర్నర్ కున్న ప్రత్యేక అధికారాలతో సరిచేసి ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు లోకేష్. గడిచిన రెండు సంవత్సరాల నుండి ఏపిపిఎస్సి లో రాజకీయ వ్యక్తుల చొరవ ఎక్కువ అయిందని, ఆ కారణంగానే గ్రూప్ 1 కు చెందిన అభ్యర్థులు న్యాయం కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని విన్నవించుకున్నారు.  మూడు సంవత్సరాల క్రితం వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించిన మెయిన్స్ ఎగ్జాం గత డిసెంబర్ లో నిర్వహించారు. ఫలితాలు ఈ ఏప్రిల్ లో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే విచిత్రంగా 7000 మంది అభ్యర్థుల్లో కేవలం 340 మంది మాత్రమే ఇంటర్వ్యూ కు సెలెక్ట్ అయ్యారు. దీనిపై అభ్యర్థులకు చాలా అనుమానాలున్నట్లు లోకేష్ తెలిపారు. ఇలా జరగడానికి కారణం వారు అవలంభించిన డిజిటల్ వేల్యూష‌న్ అని గట్టిగా చెప్పారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో ఈ డిజిటల్ వేల్యూష‌న్ గురించి ఎటువంటి విషయాన్ని ప్రస్తావించకపోగా, దీనిపై ముందస్తుగా ఏ విధమైన వివరాలను తెలుసుకోకుండా అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలాడారని చెప్పుకొచ్చారు.

ఎంతో కటినమైన యుపిపిఎస్సి లాంటి పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సైతం ఏపిపిఎస్సి లో అర్హత సాధించకపోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. ఈ విషయంపై ఉన్న అనుమానాలకు వివరణ కోసం ఎంతోమంది అభ్యర్థులు సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించగా అక్కడ వారికి సరైన వివరణ ఇవ్వకపోగా అందరికీ ఒకే రకమైన సమాధానం ఇవ్వడంతో అనుమానాలు ఇంకా బలపడ్డాయి. పైగా ఇందులో ఎంపిక కాబడిన  340 మంది అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలియపరచలేదు. ఎప్పటిలాగే వేల్యూష‌న్ మ్యాన్యువల్ పద్దతిలో  చేయకపోవడం వలనే ప్రతిభ ఉండి, అర్హత కాగలిగే  సత్తా ఉండి కూడా డిస్ క్వాలిఫై అయ్యారు. వీటన్నింటికీ ఒక పరిష్కారం దొరకాలంటే ఏపిపిఎస్సి డిజిటల్ వ్యాల్యుయేషన్ కి సంబంధించిన శ్వేతపత్రాన్ని వదలాలి అని అంటున్నారు. మరి ఈ లెటర్ పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సిన ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: