పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేకపోవడంతో చాలా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు కూడా జరగడం లేదు. అయితే మరోసారి ఇలాంటి వైఫల్యాలు పునరావృతం కాకుండా చూడాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిల ను నియమిస్తూ వస్తున్నారు. గుంటూరు జిల్లాలో కీలకమైన సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పదవి విషయం లో మాత్రం చంద్రబాబు ఇప్పటివరకు తేల్చలేదు.
అక్కడ ఇన్చార్జి పదవి కోసం టిడిపి లో ఇద్దరు సీనియర్ నేతలు వారసులు పోటీపడుతున్నారు. గత ఏడాది కాలంగా ఈ ఇద్దరు వారసులు సత్తెనపల్లి సీటు కోసం పోటీ పడుతుండడంతో చంద్రబాబు సైతం ఎవరికి ఇన్ చార్జ్ పదవి ఇవ్వాలో తెలియక పెండింగ్లో పెడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు సత్తెనపల్లి సీటు ఎవరికి ఇవ్వాలన్న విషయంపై ఆయన ఓ నిర్ణయానికి వచ్చేసినట్టే తెలుస్తోంది.
కోడెల వారసుడు శివరాం కి సత్తెనపల్లి సీటు ఇచ్చేసి... రాయపాటి తనయుడు రంగారావు ను గుంటూరు పశ్చిమం కు పంపుతారని అంటున్నారు. అయితే ఇప్పటికే అక్కడ పార్టీ ఇన్చార్జ్ గా కోవెలమూడీ రవీంద్ర ( నాని ) ఉన్నారు. మరి ఆయన్ను ఎక్కడ సెట్ చేస్తారో ? లేదా ఏదైనా హామీ తో ఆయన్ను ఆపుతారా ? అన్నది కూడా చూడాలి. అలా ఈ ఇద్దరు నేతల మధ్య చంద్రబాబు సయోధ్య కుదుర్చుకునేందుకు ప్లాన్ చేశారని జిల్లా టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.