ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త గొడవ స్టార్ట్ అయ్యింది. మాదిగ వర్సస్ మాదిగ వివాదం జరుగుతుంది. కూటమి అభ్యర్థులకు ఓట్లు వెయ్యాలంటూ పిలుపు నిచ్చిన మందకృష్ణ మాదిగ తీరుపై తీవ్రంగా కోప్పడుతున్నాయి మాదిగ సంఘాలు.మందకృష్ణ మాదిగకు వ్యతిరేకంగా సమావేశమయ్యి ఏకగ్రీవ తీర్మానం చేశాయి. 25 మాదిగ సంఘాలు..వర్గీకరణ పేరుతో ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారని ప్రశ్నించాయి.ఈమధ్య టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సమావేశమయ్యారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే తమ సపోర్ట్ ఉంటుందని ప్రకటించారు. వర్గీకరణ విషయంలో మాదిగలను జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని ఆరోపించిన మందకృష్ణ.. తెలుగుదేశం అధికారంలో రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు. మాదిగలంతా కూటమి గెలుపు కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే కూటమి పార్టీలకు ఓట్లు వెయ్యాలంటూ మందకృష్ణ మాదిగ పిలుపునివ్వడానికి ఇతర మాదిగ సంఘాలు చాలా తీవ్రంగా తప్పుబడుతున్నాయి.


మంద కృష్ణ మాదిగకు కౌంటర్‌గా విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించిన 25 మాదిగ సంఘాలు..వచ్చే ఎన్నికల్లో జగన్‌ మోహన్ రెడ్డికే తమ సపోర్ట్ అని స్పష్టం చేశాయి. వర్గీకరణ పేరుతో చంద్రబాబు నాయుడు, మందకృష్ణలు 30 ఏళ్ల నుంచి మాదిగలను మోసం చేస్తున్నారని.. ఎస్సీ వర్గీకరణ ద్వారా 22 వేల ఉద్యోగాలొచ్చాయనేది పచ్చి అబద్ధమని మాదిగ సంఘాల నేతలు కోపం వ్యక్తం చేశారు. గతంలో వందమంది మాదిగల్లో పది మందికి మాత్రమే లబ్ధి జరిగేదని.. ముఖ్యమంత్రి జగన్‌ హయాంలో 100 కి 90 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. మాదిగల ఆత్మ గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ తాకట్టు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న నేతలు.. తమకు మేలు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్నికల్లో సపోర్ట్ ఇస్తామని స్పష్టం చేశారు.మందకృష్ణ మాదిగ మద్దతిచ్చిన బీజేపీ ప్రభుత్వం..వర్గీకరణ బిల్లును ఎందుకు ఆమోదించలేకపోయిందని వారు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న మందకృష్ణ ఎత్తుగడలను తిప్పికొడతామన్నారు. ఈ నెల 30న మందకృష్ణ మాదిగ తలపెట్టిన సమావేశాన్ని అడ్డుకుంటామని మాదిగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: