•అభివృద్ధిలో అక్రమాలే వైసిపికి శాపం

•కూటమి ఏకమై టిడిపికి అండగా

•భాను ప్రకాష్ గెలుపు ఖాయమేనా..

(చిత్తూరు జిల్లా నగరి - ఇండియా హెరాల్డ్)
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ సీటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కమ్మ వర్సెస్ రెడ్డి మధ్య పోటి హోరాహోరీగా సాగుతోంది.. వైసీపీ తరుపున నగరి నియోజకవర్గము నుండి అభ్యర్థిగా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజా బరిలోకి దిగుతుండగా మరొకవైపు టిడిపి నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గాలి భాను ప్రకాష్ నాయుడు రంగంలోకి దిగుతున్నారు. మరి ఇంతటి టఫ్ కాంపిటీషన్లో గెలుపు ఎవరిది అనేది ఇప్పుడు చూద్దాం..


నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తమకు తామే పోటీ అంటే మరి కొంతమంది ఓట్లు శాతంతో తమ వద్దకు కూడా రాలేరని చెబుతున్నారు ఇక వారెవరో కాదు అటు రోజా ఇటు గాలి భాను ప్రకాష్.. ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే నియోజకవర్గం నగరి. ఇక్కడ సినీ గ్లామర్ తో రాజకీయాల్లోకి వచ్చిన రోజా ఒకవైపు ఉంటే తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకొని రాజకీయ రంగంలోకి అరంగేట్రం చేస్తున్న గాలి భాను ప్రకాష్ నాయుడు మరొకవైపు వున్నారు. దీంతో నగరిలో ముఖాముఖ పోటీ అనివార్యమైంది. అయితే ఆంధ్రప్రదేశ్లో వివిధ నియోజకవర్గాలలో పోటాపోటీగా ప్రచారాలు జరుగుతుంటే.. నగరిలో మాత్రం చడి చప్పుడు లేకుండా ప్రచారాలు జరుగుతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


మరొకవైపు నగరిలోని కొన్ని గ్రామాలలో అసలు ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అన్నట్టుగా పరిస్థితి వుంది.. అసెంబ్లీలో అయినా టీవీ టాక్ షో లలో నైనా తన వాక్చాతుర్యంతో గడగడలాడించే రోజా ప్రచారం అంటే అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తన వాక్ పటిమతో అందరిని చెండాడుతారని  కామెంట్లు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సమయంలో ప్రజలు ఎవరికి అనుకూలంగా ఉన్నారు అనే విషయానికి వస్తే..ముఖ్యంగా  రోజా విషయానికి వస్తే.. మొదట సినిమా ఇండస్ట్రీ నుంచి టిడిపిలోకి అడుగుపెట్టిన ఈమె 2004లో టిడిపి నుంచి నగరి నియోజకవర్గ తరఫున పోటీ చేసి ఓడిపోయింది. 2009లో చంద్రగిరిలో కూడా టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయింది.. ఆ తర్వాత వైసిపిలోకి చేరిన ఈమె 2014,  2019 ఎన్నికలలో వైసీపీ నుంచి నగరి బరిలో దిగి వరుసగా గెలుపొందింది. మరోసారి గెలుపొందితే ఈమె హ్యాట్రిక్ విజయం కొట్టడం ఖాయం..

తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న గాలి భాను ప్రకాష్.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత.. అమెరికాలో పీజీ చేశాడు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు.. ముద్దు కృష్ణమనాయుడు పుత్తూరు నుంచి ఆరుసార్లు,  నగరి నుంచి ఒకసారి గెలుపొందారు. ఈయన మరణించడంతో భాను రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

వీరిద్దరి గెలుపోవటముల విషయానికి వస్తే.. 2019 ఎన్నికల్లో ఏ ఏ సామాజిక వర్గాలైతే రోజాకు అండగా నిలిచాయో ఇప్పుడు వారి నుంచి వ్యతిరేకత మొదలైందని తెలుస్తోంది. చిత్తూరు లోక్సభ స్థానంలో భాగంగా నిండ్ర , విజయపురం, నగరి , పుత్తూరు,  వడమాలపేట మండలాలలో బలాలు ఉన్న నాయకులు గతంలో రోజాకు సహాయపడ్డారు.. కానీ ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంతో నగరిలో రోజా విజయం వరిస్తుందా అన్న సందేహం కూడా మొదలైంది. అంతేకాదు ఇక్కడ అభ్యర్థిని మార్చాలాంటూ సీఎం జగన్ పై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసింది. అయితే ఇక్కడ రోజానే కన్ఫర్మ్ చేయడంతో ఇక్కడ ఉన్న నాయకులకు సహించడం లేదు.. మరొకవైపు అభివృద్ధి పనుల్లో అవినీతి చోటు చేసుకున్న కారణంగా రోజాకు తీవ్ర వ్యతిరేకత నెలకొంది.

ఈసారి ఎలాగైనా నగరిని టిడిపి కైవసం చేయాలి అని కూటమిలో భాగంగా ఇన్ని రోజులు దూరంగా ఉన్న నాయకులంతా ఇప్పుడు ఏకమై గాలి భాను ప్రకాష్ ను గెలిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు వైసిపి నేతలంతా మూకుమ్మడిగా ఉండేవారు.. కానీ వారిలో కొంతమంది టిడిపిని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు .ఫైర్ బ్రాండ్ ముందు భానుడు నెగ్గి ఆమెను ఓడిస్తారనే వార్తలు స్పష్టమవుతున్నాయి మరి పూర్తి ఫలితాలు వెలువడే వరకు ఎవరిది పైచేయో చెప్పడం కష్టంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: