ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు నాయకులు - నారా చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఇద్దరూ భిన్న స్వభావాలు, వేర్వేరు ఆలోచనా ధోరణులు కలిగిన నాయకులు. కానీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, విపత్తు నిర్వహణ విషయాల్లో ఇద్దరూ తమదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఈ ఇద్దరి పాలనా శైలి స్పష్టంగా భిన్నంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు “చేసే నాయకుడు”గా పేరు తెచ్చుకున్నాడు. విపత్తు వచ్చినా, వరదలైనా, తుఫానులైనా ఆయన నిద్రపోకుండా అధికారులను ఒత్తిడి చేస్తూ పనులు చేయిస్తారు. తాజాగా మొంథా తుపాను విషయంలోనూ అదే తీరుగా వ్యవహరించారు. ప్రతి జిల్లాలో పరిస్థితులను RTGS సిస్టమ్ ద్వారా నిఘా వేశారు. ఏ ప్రాంతంలో ప్రమాదం ఉందో, ఎక్కడ రక్షణ చర్యలు అవసరమో తెలుసుకుని వెంటనే ఆదేశాలు ఇచ్చారు.


ఇక‌ తన అనుభవం, టెక్నాలజీ వినియోగం వల్లే ఈసారి తుపాను సమయంలో ప్రాణ నష్టం తక్కువగా ఉండటం విశేషం. ముందుగానే పాఠశాలలకు సెలవులు, ప్రత్యేక అధికారుల నియామకం, నిధుల విడుదల వంటి నిర్ణయాలు ఆయన దూరదృష్టిని చాటాయి. అయితే, విజయవాడ బుడమేరు వరదలపై వచ్చిన విమర్శలు మాత్రం బాబును కొంత ఇబ్బందికి గురి చేశాయి. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి శైలి మాత్రం “సైలెంట్ అడ్మినిస్ట్రేషన్”. ఆయన పెద్దగా హడావుడి చేయరు, బయటకు కూడా ఎక్కువగా రారు. కానీ కరోనా మహమ్మారి సమయంలో జగన్ చూపిన ధైర్యం, నిర్ణయాత్మకత దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండగా ఆయన క్యాంప్ కార్యాలయంలో నుంచే సమీక్షలు, ఆదేశాలు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన నమ్మకం సింపుల్ – “నేను బయటకు వెళ్తే అధికారులు ప్రజలకన్నా నన్నే చూసుకుంటారు.” అందుకే ఆయన కూర్చుని నడిపిస్తారు.

 

ఇక ప్రచారం విషయంలో కూడా ఇద్దరి మధ్య విభిన్నత స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు చేసిన పనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నమ్మకం కలిగి ఉంటారు. ఆయన దృష్టిలో రాజకీయ నాయకుడికి ప్రజాసేవతో పాటు ప్రచారం కూడా అవసరం. అందుకే ప్రతి పనిని ప్రచారంగా మలుస్తారు. అదే సమయంలో జగన్ మాత్రం “ప్రచారం కాదు, ఫలితం ముఖ్యం” అనే ఆలోచనలో ఉంటారు. తాము చేసిన పనిని ప్రజలే గుర్తిస్తారని నమ్ముతారు. మొత్తం మీద ఇద్దరి లక్ష్యం ఒకటే – రాష్ట్రాభివృద్ధి, ప్రజల రక్షణ. కానీ పద్ధతులు వేరు. చంద్రబాబు నాయుడు దూకుడుతో వ్యవహరిస్తే, జగన్ నిశ్శబ్దంగా నడిపిస్తారు. అయితే ప్రజల దృష్టిలో “చూసిన పని”కి విలువ ఎక్కువ. అందుకే బాబు కనిపిస్తారు, జగన్ కనిపించరు అన్న వ్యత్యాసం పాలనా ఫలితాల్లో కూడా ప్రతిఫలిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: