రోజులు మారాయి. అంతా ఇపుడు సోషల్ మీడియా యుగం. ఎవరేమిటి అన్నది అందరికీ తెలుస్తుంది. అయినా తెల్లారి లేస్తే మళ్లీ కొత్తగా పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే, ప్రజల మనసుల్లో ఏ విషయం ఎంతగా రిజిస్టర్ అవుతుందనేది అంచనా వేయడం కష్టంగా మారింది. ఇదిలా ఉంటే, రాజకీయాలకు, సినిమాలకు పబ్లిసిటీ తప్పనిసరి. లేకపోతే కష్టం. "ప్రచారం పీక్స్, పెర్ఫార్మెన్స్ వీక్" అని సులభంగా విమర్శించవచ్చు. కానీ, ఇది భారతదేశం. వెస్ట్రన్ కంట్రీస్ మాదిరిగా కొన్ని 'బిగ్ డిబేట్స్' చూసి జనాలు ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటు అని విశ్లేషకులు అంటున్నారు. ఫెయిల్ అయింది అక్కడేనా? వైసీపీ అనుభవం .. వర్తమాన రాజకీయాల్లో చేసింది ఎంత అన్నది పక్కన పెడితే, ఆ చేసిన మంచిని ఒకటికి వంద సార్లు చెప్పుకోవాల్సిన అగత్యం ఉంది.
 

ఎందుకంటే, జనాలకు షార్ట్ మెమరీ. పైగా, వారికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ఒకే వైపు చూస్తూ కూర్చోరు. వారిని తమ వైపే ఉంచుకోవాలంటే ఎన్నో విద్యలు, విన్యాసాలు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. వైసీపీ విషయంలో ప్రచారం వీక్ అన్నది బహిరంగ రహస్యం. జగన్ ఐదేళ్ల పాలనలో ఏకంగా ₹2.74 లక్షల కోట్ల రూపాయలను నేరుగా నగదు బదిలీ పథకం కింద ప్రజల ఖాతాలో వేశారు. బటన్ నొక్కిన వెంటనే లబ్ధిదారుడి ఫోన్‌కు డబ్బు జమ అయిపోయింది. మధ్య దళారీలు లేరు, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం సమస్య లేదు. కానీ, ఎవరు ఇచ్చారు అన్నది కూడా ఆఖరుకు జనాలకు అవసరం లేకపోయింది. 'చేసింది చెప్పుకోకపోవడం' వల్లనే 2024లో దారుణమైన రిజల్ట్ వచ్చిందని ఇప్పుడు వైసీపీ వర్గాలు గ్రహిస్తున్నాయి. పబ్లిసిటీ వాల్యూ ఏమిటనేది కూటమి పాలన స్పష్టంగా తెలియజేస్తోంది.



బాబు జోరు ముందు వెనుకడుగు వేసిన విధానం .. తాజాగా సంభవించిన 'మోంథా తుఫాన్' విషయమే తీసుకుందాం. చంద్రబాబు సచివాలయంలో నిరంతరం ఉంటూ అధికారులను పర్యవేక్షించారు. ఆ వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ఏరియల్ సర్వే చేసి, బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. ఇవన్నీ ఆయన ఒక పద్ధతి ప్రకారం, నిరంతరాయంగా ప్రచారం అయ్యేలా చేశారు. దాంతో బాబు చేసిన కృషి జనాలకు తెలిసివచ్చింది. అదే జగన్ టైంలో కూడా తుఫాన్లు, ప్రకృతి విపత్తులు వచ్చాయి. జగన్ కూడా మీటింగ్‌లు పెట్టేవారు, అధికారులకు బాధ్యతలు ఇచ్చేవారు. అయితే, ఇదంతా ఎక్కడా పెద్దగా పబ్లిసిటీకి నోచుకోలేదు. 'రూటీన్‌గా చేసే దానికి ప్రచారం ఎందుకు?' అన్నది గత పాలకుల వైఖరి. కానీ, అదే జనాలకు కావాల్సింది. అదే నయా ట్రెండ్ పాలిటిక్స్ అని వైసీపీ పెద్దలకు ఇపుడు అర్థమవుతోంది.



పధకాల విషయంలో కూడా చంద్రబాబు ప్రతి నెలా ఒక పేద ఇంటికి వెళ్లి ముచ్చట్లు పెట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నారు. ఏ పథకం ఇచ్చినా జనంలోనే ఉంటున్నారు, వారి మధ్యనే కార్యక్రమాలు చేస్తున్నారు. బాబు చేస్తున్నది 'అతి', 'పబ్లిసిటీ పీక్స్' అని విమర్శించడం ఓకే అయినా, వైసీపీ మరీ వీక్‌గా ఉంటే ఎలా అన్న చర్చ సాగుతోంది.  వైసీపీకి సలహా: తీరు మార్చుకోవాల్సిందే! .. ఈ విషయంలో వైసీపీ తన తీరు మార్చుకోవాల్సిందే అని అంటున్నారు. తాము ఏమి చేశామన్నది నిత్యం జనంలో చర్చ పెట్టాలని, అలాగే మళ్లీ వస్తే ఏమి చేస్తామన్నది కూడా వారికి సోదాహరణంగా వివరించాలని సూచిస్తున్నారు. వైసీపీ అధినాయకత్వానికి లోటుపాట్లు ఏమిటో తెలిసి వచ్చాయి; ఇక వాటిని అమలు చేయడం ఎలా అన్నదానిపై దృష్టి సారించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: