వైసీపీ అధినేత మరియు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు అదే స్వస్థలంలో మరోసారి రాజకీయంగా తలనొప్పి పెంచే పరిణామాలు వ‌రుస‌గా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో, తాజా సంఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. వేంపల్లి మండల కేంద్రానికి చెందిన 200 మంది మైనారిటీ కుటుంబాలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరడం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి సమక్షంలో జరిగిన చేరికల కార్యక్రమంలో కొత్తగా చేరిన వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ తరఫున ఇది కేవలం చేరిక మాత్రమే కాకుండా, భవిష్యత్ రాజకీయ సమీకరణలకు నాంది అని బీటెక్ రవి వ్యాఖ్యానించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ వేంపల్లిని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఈ ప్రాంతాన్ని వెనక్కి నెట్టిన వారు ఎవరో ప్రజలకు తెలుసు. గతంలో రిగ్గింగ్‌కు పాల్పడిన సతీష్ రెడ్డి కుటుంబాన్ని ధైర్యంగా అడ్డుకున్న చరిత్ర టీడీపీ కార్యకర్తలదే. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి సతీష్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం మాత్రమే కాదు, రాజకీయ నాటకం కూడా ” అంటూ ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడమే మా ఒక్క లక్ష్యం అని బీటెక్ ఘంటా ప‌థంగా చెపుతున్నారు.


తాజా చేరికలతో పులివెందులలో తెలుగుదేశం పార్టీకి బలం గణనీయంగా పెరిగిందనే అంచనా వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు అన్ని వర్గాలకు వ్యూహాత్మకంగా చేరువ అవుతున్న టీడీపీ, ముఖ్యంగా మైనారిటీ వర్గంలో పార్టీ పునాది బలపడటంపై హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి. జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీకి డిపాజిట్లు పోవ‌డం, ఇటు వేంప‌ల్లె లాంటి కంచుకోట‌లో .. వైసీపీకి బ‌లంగా ఉండే మైనార్టీలు ప‌సుపు కండువా క‌ప్పుకోవ‌డం పార్టీ అధినేత జ‌గ‌న్‌కు ఇబ్బందే అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: