కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ తగ్గించడం కానీ, నిలిపివేయడం కానీ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. ఈ కారణంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పెన్షన్స్లో కేంద్రం కోత విధించ నుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
దీంతో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా ఆ వార్తలపై స్పందించిన సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ.. అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ఇంతకు ముందు చెప్పినట్టుగానే పెన్షన్ తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వెల్లడించింది. పెన్షన్దారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. పెన్షన్దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది