ఎయిర్పోర్టుల ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో విమానాశ్రయాల నిర్వహణా బాధ్యతలను వ్యక్తులు...సంస్థలకు అప్పగిస్తోంది. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తాజా నిర్ణయంతో దేశంలో ప్రైవేటీకరించిన విమానాశ్రయాల సంఖ్య పన్నెండుకు చేరింది. అసలు...కేంద్రం ఎయిర్పోర్టులను ఎందుకు ప్రైవేటీకరిస్తూ వస్తోంది?
ఇండియాలో విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని ఎయిర్పోర్టుల ప్రైవేటీకరణ పూర్తయింది. ఆ దిశగానే మరికొన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారణాశి సహా దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్నో, అహ్మదాబాద్, జయపుర, మంగళూరు, తిరువనంతపురం, గౌహతి విమానాశ్రయాలను నిర్వహణ, అభివృద్ధి, కార్యకలాపాల కోసం పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇప్పడు కొత్తగా ఆ జాబితాలో మరో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేయాలని ఏఏఐ ప్రతిపాదించింది.
ఇక...ఇప్పటికే ఆరు విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేశారు. వాటితో పాటు అమృత్సర్, వారణాశి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్పూర్, తిరుచ్చి విమానాశ్రయాలను కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని సెప్టెంబరు 5న జరిగిన బోర్డ్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బోర్డు నిర్ణయాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపించారు.
నిజానికి...దేశవ్యాప్తంగా ఏఏఐ వందకుపైగా విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతలను చూసుకొంటోంది. మొదటి దశ ప్రైవేటు పరంలో భాగంగా అదానీ గ్రూప్ ఆరు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టును సొంతం చేసుకొంది. దీనికి జులై 3న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాల నిర్వహణను అదానీ సంస్థకు అప్పగించారు. మరో మూడింటిని అప్పగించాల్సి ఉంది.
మొత్తానికి...భారత్లో విమానాశ్రయాల ప్రైవేటీకరణపై అటు...ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా...ఇటు కేంద్ర ప్రభుత్వం సైతం దూకుడుగానే వెళ్తున్నాయి. ఐతే...దేశంలోని అన్ని విమానాశ్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాటానికి మాత్రం ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉంది.