తల్లిదండ్రులతో పంచుకోలేని విషయాలను కూడా మిత్రులతో పంచుకుంటూ ఉంటాము. మిత్రుడికి ఆపద వచ్చిందంటే ముందుంటాము. అదే మిత్రుడికి సంబంధించిన ఏ సంబరాన్ని అయినా ధూమ్ ధాం చేస్తాము. అలాగే ఓ వ్యక్తి కూడా తన మిత్రులకు పుట్టిన రోజు పార్టీని ఇవ్వాలని అనుకున్నాడు. ఇక అందుకు ముందు రోజు సాయంత్రం నుంచీ ఓ లాడ్జీలోని గదిలో జల్సా చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ.. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఆ స్నేహితుల్లోని ముగ్గురి చేతిలో ఆ లాడ్జీ వద్దే హత్యకు గురైయ్యాడు.

ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. నగరంలోని ఉప్పంగి హరిజనవాడకు చెందిన రామచంద్రయ్య, పుష్పమ్మ దంపతుల చిన్న కుమారుడు ప్రసన్నకుమార్‌ అలియాస్‌ బొజ్జ (29) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులకు అండగా నిల్చున్నాడు. అంతేకాదు.. అతడు ఓ కార్పొరేటర్‌కు ప్రధాన అనుచరుడు కూడా.

అయితే సోమవారం ఇతడి పుట్టినరోజు కావడంతో స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు తిరుపతి- రేణిగుంట మార్గంలోని ఓ లాడ్జిలో ఆదివారం సాయంత్రం గది అద్దెకు తీసుకున్నారు. ఇక సోమవారం సాయంత్రం వరకు ఎల్లంరెడ్డి, పవన్‌కుమార్‌, బాలాజీ తదితర మొత్తం ఎనిమిదిమంది స్నేహితులతో కలిసి ఆ గదిలోనే ఉన్నారు. కాగా.. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఎల్లంరెడ్డి, పవన్‌కుమార్‌, బాలాజీ లాడ్జీ గదినుంచి బయటకు వెళ్లారు.

వారిద్దరూ కలిసి మళ్ళి  రాత్రి 8 గంటల సమయంలో తిరిగి లాడ్జీ వద్దకు వచ్చిన వీరు.. ప్రసన్నకుమార్‌ను కిందకు రమ్మన్నారు. ప్రసన్నకుమార్‌ కిందకు రాగానే అతడిపై కత్తులు, బీరు బాటిళ్లతో దాడిచేసి గుండెల్లో పొడిచి అక్కడి నుండి పరైయ్యారు. ఈ దాడిలో ప్రసన్న కుమార్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. లాడ్జీ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే స్నేహితులమధ్య గొడవకు, హత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదని సీఐ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: