ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి హీరో అయిపోయారు. ఢిల్లీ పర్యటనలో ఒకేరోజు ఇటు ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అయ్యారు. అటు అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని అక్కడ కూడా హీరో అనిపించుకున్నారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబునాయుడు కానీ ఎల్లోమీడియా కానీ లేకపోతే ఇతరత్రా ప్రతిపక్షాలు కూడా జగన్ కు వ్యతిరేకంగా నోరిప్పలేకపోయాయి.  ఎందుకంటే జగన్ ఈ స్ధాయిలో సక్సెస్ అవుతారని వీళ్ళస్సలు ఊహించుండరు. అందుకే ప్రత్యర్ధులందరికీ ఒకేసారి నోళ్ళు పడిపోయాయి. మోడితో జగన్ భేటి సుమారు 50 నిముషాలు జరిగింది. ఈ సమావేశంపై అనేక ఊహాగానాలు వచ్చినా వాస్తవం ఏమిటంటే జగన్ను ఎన్డీఏలో చేరమని ప్రధాని ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానాన్ని జగన్ తిరస్కరించారు.




రాష్ట్ర విభజనలో ఏపికి ఇచ్చిన ప్రత్యేకహోదా  హామీ ని అమలు చేస్తే ఎన్డీఏలోకి వస్తానని జగన్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక టైమ్స్ ఆప్ ఇండియా ప్రచురించింది.  ఎన్డీఏలోకి వచ్చి మంత్రిపదవులు తీసుకోవటం కన్నా తనకు రాష్ట్ర ప్రయోజనాలే ఎక్కువంటూ చెప్పేశారట. దాంతో ప్రత్యేకహోదాకు ప్రత్యామ్నాయంగా హోంమంత్రి అమిత్ షా తో చర్చించాలని మోడి చెప్పినట్లు తెలుస్తోంది.  సరే విషయం ఏదేమైనా ప్రధాని ఆహ్వానాన్ని కూడా జగన్ పక్కనపెట్టేశాడనే విషయం బయటకు రావటంతో జనాల ముందు జగన్ నిజంగానే హీరో అయిపోయారు. మొన్నటి వరకు ఢిల్లీకి వెళ్ళినపుడల్లా జగన్ ప్రధాని కాళ్ళు పట్టుకుని వస్తున్నాడంటూ బురద చల్లేస్తున్న  ఎల్లోబ్యాచ్ కు తాజా పరిణామంతో నోళ్ళు మూతపడిపోయాయి.




ఇక రెండో అంశమైన జలవివాదం సమావేశంలో కూడా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ను జగన్ దుమ్ము దులిపేశారు. ప్రాజెక్టుల వారీగా,  ఇష్యు బేసుడుగా జగన్ తన వాదన వినిపించారు. ఏపి ప్రాజెక్టుల విషయంలో కేసీయార్ వాదనంతా తప్పే అన్న విషయాన్ని ఉదాహరణలతో సహా నిరూపించారు. ఇదే సమయంలో తెలంగాణాలో కడుతున్న ప్రాజెక్టులకు కూడా ఎటువంటి అనుమతులు లేవన్ విషయాన్ని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు స్పష్టంగా అర్ధమయ్యేట్లు కేసీయార్ ముందే  జగన్ వివరించారు.  జగన్ వాదన కారణంగానే కోర్టుల్లో తెలంగాణా ప్రభుత్వం వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని కేసీయార్ ప్రకటించాల్సొచ్చింది. ఇక తెలంగాణాలోని ప్రాజెక్టుల డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ఇచ్చేదే లేదని ఒకటికి పదిసార్లు బల్లగుద్ది చెప్పిన కేసీయార్ చివరకు డీపీఆర్లు ఇవ్వటానికి అంగీకరించారు.




కేంద్రమంత్రి సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో జరిగిన వాదనలో ఎల్లోమీడియా కూడా జగన్ గట్టిగానే  కేసీయార్ ను నిలదీసినట్లు రాయాల్సొచ్చింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో  జగన్ గట్టిగానే వాదనలు వినిపించినట్లు జనాలకు చెప్పాల్సొచ్చింది. ఇష్టమున్నా లేకపోయినా జగన్ గురించి పాజిటివ్ గా రాయాల్సి రావటం నిజంగా ఎల్లోబ్యాచ్ కు మింగుడుపడని విషయమే. ఇంతకాలం కేసీయార్ లాలూచిపడి రాష్ట్ర ప్రయోజనాలను జగన్ పణంగా పెడుతున్నట్లు చంద్రబాబు+ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలు, రాస్తున్నదంతా కేవలం బురదచల్లుడనే విషయం జనాలకు అర్ధమైపోయింది.  ఢిల్లీ పర్యటనను ఎంత విజయవంతంగా ముగించుకున్నా జగన్ మాత్రం ఎక్కడా ఆ విషయం బయటపడ లేదు. ఢిల్లీలో తనపని తాను చేసుకున్నాడు తిరిగి అమరావతికి చేరుకున్నాడంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: