ఇక కాంగ్రెస్ - బీఆర్ఎస్ ల మధ్య విమర్శల యుద్ధం చెలరేగుతోంది. కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్తో కుమ్మక్కైందని ఆరోపిస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం టి బీజేపీ పెద్దలు తెర వెనుక కాంగ్రెస్కు సహాయం చేస్తున్నారని ప్రతిదాడి చేస్తోంది. ఈ ఆరోపణల వెనుక రాజకీయ లెక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ - జనసేనలతో చేతులు కలిపిన బీజేపీ, తెలంగాణలో మాత్రం ఆ పొత్తుకి ‘నో’ చెప్పడం విశేషం. అంటే తెలంగాణలో బీజేపీ తన సొంత శక్తిపై ఎదగాలనే ఆలోచనలో ఉందా, లేక వేరొక రాజకీయ సమీకరణను దృష్టిలో పెట్టుకుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా బలం లేకపోవడం తెలిసిందే. ఎన్నేళ్లుగా ప్రయత్నాలు చేసినా పార్టీ రెండవ స్థానానికైనా చేరుకోలేకపోయింది. అలాంటప్పుడు ఒంటరిగా అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ వ్యూహం మాత్రం ఆసక్తికరంగా ఉంది. దీపక్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, బీజేపీ అభ్యర్థిని ఎంపికచేయడం వెనుక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ను చీల్చడమే లక్ష్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా చూస్తే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ నడుస్తున్న దారిలో స్పష్టత కనిపించడం లేదు. పార్టీ టార్గెట్ నిజంగా అధికారమా, లేక భవిష్యత్తు కూటములకు దారితీసే సహకారమా అన్నది నవంబర్ 14న ఓటింగ్ తర్వాతే స్పష్టమవుతుంది. కానీ ఈ ఎన్నికతో తెలంగాణలో బీజేపీ రాజకీయ దిశ ఏ వైపుకు వెళ్తుందో నిర్ణయమవుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి