గత
డిసెంబర్ నెలలో ప్రపంచం దృష్టికి వచ్చిన కొవిడ్ 19 నావల్
కరోనా వైరస్, మహమ్మారిగా మారి ప్రపంచ దేశాల ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికీ కూడా ఈ
కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు సరియైన టీకా కనుగొన బడలేదు. అయితే ఇప్పుడు తాజాగా బ్రిటన్లో
పంజా విసురుతున్న కొత్త రకం
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్-19 కారక
కరోనా వైరస్ రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్లో కొత్త రకం
కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్త రకం
కరోనా వైరస్ స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్ తెలిపింది. ఈ నేపథ్యంలో
భారత్ సహా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. కొత్త రకం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో
తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. గడిచిన వారం రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైంది. అలాంటి ప్రయాణికులను గుర్తించి పరీక్షలు నిర్వహించనుంది. అటు
శంషాబాద్ ఎయిర్పోర్టులను మరోసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
రాజీవ్
గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (RGIA)లో కరోనా సర్వేలెన్స్ చేస్తూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు. కొవిడ్-19 లక్షణాలున్న వారిని నేరుగా హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందించనున్నారు. నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్లో ఉండేలా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూకే నుంచి వచ్చే విమానాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిలిపివేత
డిసెంబర్ 22 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. గత వారం రోజులుగా యూకే నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని
కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
జర్మనీ,
ఇటలీ, బెల్జియం,
ఆస్ట్రియా,
సౌదీ అరేబియా,
చెక్ రిపబ్లిక్ తదితర దేశాలు కూడా యూకే నుంచి విమానాలను నిలిపివేశాయి. ఆస్ట్రేలియాలో బ్రిటన్ తరహా
కరోనా వైరస్ కేసులు రెండు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.