మధుమేహం ఎంత ప్రమాదకరమైన సమస్యో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధుమేహం అనేది కేవలం ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా భారీగా పెరుగుతోంది. వృద్ధులతో పాటు యువతను కూడా ఈ మాయదారి రోగం పట్టి పీడిస్తోంది.రోజు రోజుకూ చాపకింద నీరులా వ్యాపిస్తోన్న ఈ ప్రమాదకర జబ్బు నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. అయితే ఈ రోగం ఉన్నట్లు చాలామంది బాధితులకు తెలియడం లేదు. ఈనేపథ్యంలో డయాబెటిస్‌ గురించి ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వీటి ప్రకారం రోజూ ఒక గ్లాస్‌ పాలు తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చట. రోజూ ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల 10 శాతం మధుమేహం ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న సైంటిస్టులు చెబుతున్నారు. రక్తంలో ఉండే గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే సామర్థ్యంతో పాటు పలు పోషకాలు పాలలో ఉంటాయని వారు పేర్కొన్నారు.ఈ మధుమేహాన్ని సరైన కాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. లేకపోతే ఇది మన కళ్లు, గుండెకు చాలా ప్రమాదకరంగా మారుతుంది.


ముఖ్యంగా రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ పెరిగితే కంటి సమస్యలు పెరిగిపోతాయి. అంధత్వం కూడా రావచ్చు. అంతేకాకుండా ప్రాణాంతక స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందట. కాగా ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55 కోట్ల మంది ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారట. దీనికి కారణం కూడా మన ఆహారమేనట. ఈనేపథ్యంలో పాలు, పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు ఈ వ్యాధిని నివారించడంలో సహాయపడతాయి. రోజూ ఒక గ్లాసు పాలు తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ముప్పు 10 శాతం తగ్గుతుందని పరిశోధనలో తేలింది. అదేవిధంగా ఏదైనా పాల ఉత్పత్తిలో 200 గ్రాములు ఈ వ్యాధిని 5 శాతం తగ్గిస్తుందని ఈ రీసెర్చ్‌లో వెల్లడైంది. పాల ఉత్పత్తులలో పోషకాలు, విటమిన్లతో పాటు మరెన్నో బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయని, ఇవి గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.కాబట్టి అవి తప్పనిసరిగా తీసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: