ప్రముఖ కమెడియన్ అలీకి మాతృ వియోగం కలిగింది. అలీ తల్లి జైతూన్ బీబీ అనారోగ్యంతో స్వస్థలం రాజమండ్రిలో కన్నుమూశారు. అలీ ఒక సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్నారు. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే అలీ శోకసంద్రంలో మునిగిపోయారు. అలీ హుటాహుటిన బయలుదేరి రాంచీ నుండి హైదరాబాద్ వస్తున్నారు. అలీ బంధువులు జైతూన్ బీబీ భౌతిక ఖాయాన్ని రాజమండ్రి నుండి హైదరాబాద్ కు తరలించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
నిన్న రాత్రి సమయంలో అలీ తల్లి మరణించారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అలీ చాలా సందర్భాల్లో తన తల్లిపై ఉన్న ప్రేమానురాగాల గురించి కమెడియన్ గా ఎదగడంలో తన తల్లి సహకారం గురించి చెప్పేవారు. ఈరోజు కమెడియన్ గా అలీ ఇంత గొప్ప స్థానంలో ఉండటానికి తన తల్లిదండ్రులే ప్రధాన కారణమని చెప్పేవారు. షూటింగ్ లు లేకపోతే అలీ తన తల్లితో సమయం గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు. 
 
తాను గొప్ప నటుడిగా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అలీ సామాన్యుడిగా తన తల్లికి సేవలు చేసేవారు. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా రోజూ తన తల్లితో అలీ కొంతసేపైనా ఫోన్ లో మాట్లాడేవారు. గతంలో అలీ తన తల్లిపై ప్రేమతో సేవలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలీ పలు కార్యక్రమాల్లో తన తల్లి తనకోసం పడిన కష్టాన్ని గుర్తు చేసుకొని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. 
 
మరోవైపు అలీ ఇప్పటికే తన తండ్రి పేరిట పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతి చెంది వారం రోజులు కూడా గడవక ముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకోవడం గమనార్హం. అలీ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: