టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. తొలిసారిగా ప్రభాస్ తో కలిసి పూజా హెగ్డే జోడి కడుతున్న ఈ సినిమాని యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తుండగా యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం ఇటీవల కొన్నాళ్లుగా రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ ని నిర్మిస్తున్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం యూరప్ లో జరిగిన ప్రేమకథ గా పలు రకాల కమర్షియల్ హంగులతో దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని తీస్తున్నట్లు తెలుస్తోంది.  

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభించింది. పాన్ ఇండియా మూవీ గా ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ ని ఎవరు అందిస్తున్నారు అనే విషయమై ఇప్పటివరకు యూనిట్ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే నేడు యువ సంగీత దర్శకుడు జీబ్రాన్ పుట్టినరోజు సందర్భంగా అతడికి యువి క్రియేషన్స్ వారు ప్రత్యేకంగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బర్త్ డే విషెస్ చెప్పడంతో, అతడే రాధేశ్యామ్ కు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడని, అందుకే యువి బ్యానర్ వారు ప్రత్యేకంగా విషెస్ తెలిపారని కొందరు అంటున్నారు.  

అయితే గతంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించి ఉండడం, అలానే దర్శకుడు రాధాకృష్ణ తీసిన ఫస్ట్ సినిమా జిల్ కు కూడా అతడే మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో, ఫైనల్ గా  రాధేశ్యామ్ కు కూడా అతడినే మ్యూజిక్ అందించేందుకు ఎంచుకున్నారని చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ప్రభాస్ మూవీ తో జీబ్రాన్ మంచి ఛాన్స్ పట్టేసినట్లే ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: