మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారిగా అతడు సినిమా తీశారు. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద సక్సెస్ కొట్టింది. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళి మోహన్ ఈ సినిమాని నిర్మించారు. అనంతరం మరొక్కసారి 2010లో సూపర్ స్టార్ మహేష్ తో ఖలేజా సినిమా తీసిన త్రివిక్రమ్, ఆ మూవీతో ఘోర పరాజయాన్ని చవిచూశారు.
అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కూడా మణిశర్మ సంగీతం అందించగా కనకరత్న మూవీస్ బ్యానర్ పై దీనిని సింగనమల రమేష్, సి కళ్యాణ్ నిర్మించారు. మళ్ళి 12 ఏళ్ళ తరువాత త్వరలో మరొక్కసారి సూపర్ స్టార్ తో తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు త్రివిక్రమ్. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించనుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమాపై అందరిలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్ కమర్షియల్ హంగులతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రూపొందనున్నట్లు టాక్.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోతో పాటు విలన్ పాత్ర కూడా ఎంతో అదిరిపోతుందని, కాగా ఆ పవర్ఫుల్ రోల్ కి బాలీవుడ్ నటులైన సునీల్ శెట్టి, సంజయ్ దత్ లలో ఎవరో ఒకరు నటించే ఛాన్స్ ఉందని సమాచారం. ముఖ్యంగా ఈ పాత్ర కోసం తొలుత సునీల్ శెట్టి ని యూనిట్ సంప్రదించిందని, అయితే ప్రస్తుతం ఆయనకి వరుసగా కమిట్మెంట్స్ ఉన్న కారణంగా ఒకవేళ ఆయన డేట్స్ కనుక అడ్జస్ట్ కాకపోతే ఆ స్థానంలో సంజయ్ దత్ ని తీసుకునేందుకు ముందే యూనిట్ ప్లాన్ చేసిందని టాక్. మొత్తంగా అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో పట్టాలెక్కనుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: