ప్రస్తుతం వరుసగా కెరీర్ పరంగా విజయాలతో దూసుకెళ్తున్నారు దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి, అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో అతి త్వరలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెల్సిందే. వాస్తవానికి ఎన్నో ఏళ్ళ క్రితమే ఈ కాంబినేషన్ లో మూవీ రావాల్సింది. అయితే కొన్ని కారణాల వలన అది కార్యరూపం దాల్చలేదు.
అయితే మొత్తానికి మహేష్, రాజమౌళి మూవీ ఫిక్స్ కావడంతో కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ ఆడియన్స్ లో కూడా దీనిపై విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఎంతో భారీ స్థాయిలో ఇండియన్ ఫిలిం హిస్టరీ లో నిలిచిపోయే విధంగా ఎంతో భారీ ఎత్తున ఈ మూవీని నిర్మించనున్నట్లు టాక్. సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే భారీ అడ్వెంచరస్ డ్రామా మూవీగా ఇది తెరకెక్కే ఛాన్స్ ఉందని, అటువంటి స్టోరీ పై తాను కసరత్తు చేస్తున్నట్లు ఇటీవల కథకుడు వి విజయేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

మరోవైపు ఇటీవల హాలిడే ట్రిప్ నుండి తిరిగివచ్చిన రాజమౌళి ప్రస్తుతం తండ్రితో కలిసి వరుసగా స్టోరీ సిట్టింగ్స్ లో  పాల్గొంటున్నారని, అతి త్వరలో స్టోరీ ఫైనలైజ్ చేసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఈ భారీ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటి శ్రద్ధ కపూర్ ఎంపికయ్యే ఛాన్స్ గట్టిగా ఉందని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ప్రభాస్ తో సాహో మూవీ చేసి మంచి క్రేజ్ దక్కించుకున్న శ్రద్ధ, స్వతహాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ కావడం విశేషం. మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ఏంటో ప్రాధాన్యత ఉండనుందని, కాగా అటువంటి పాత్రకు శ్రద్ధ అయితేనే కరెక్ట్ అని రాజమౌళి ఆలోచన చేస్తున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలి అంటే అఫీషియల్ గా న్యూస్ బయటకు వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: