ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఫస్ట్ రిలీజ్ చేసిన సినిమాలు భారీ హిట్ సాధించడంతో వాటికి కొనసాగింపుగా మరో సీక్వెల్ తెచ్చేందుకు చిత్రబృందాలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలోనే మొదటి భాగాన్ని ఆదరించిన ప్రేక్షకులు సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలో టాలీవుడ్ లోనే కాక ఇతర భాషల్లో కూడా సీక్వెల్‌ సినిమాలు రాబోతున్నాయి. వీటి వరుసలో ముందుగా చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ పుష్ప-2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'పుష్ప'. ఈ సినిమాకు రెండో భాగంగా పుష్ప 2 (పుష్ప ది రూల్) రాబోతుంది. సిద్ధూ జొన్నలగడ్డ , నేహా శెట్టి జంటగా నటించిన కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ 'డీజే టిల్లు'కు కూడా సీక్వల్ రెడీ చేస్తున్నారు చిత్ర బృందం. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగస్థలం. దీనికి కూడా సీక్వెల్ రాబోతుందని సమాచారం. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన సినిమా రాక్షసుడు. ఈ సినిమా వచ్చిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు రాక్షసుడి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ మూవీ రెండో భాగం రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కావొచ్చింది తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్ గ్యారంటీ అని ప్రేక్షకులు నమ్ముతున్నారు. అందుకే అఖండకు సీక్వెల్ కథను ముందే సిద్ధం చేశారట దర్శకుడు బోయపాటి. అఖండ సినిమా ముగిసిన తీరు చూస్తుంటే చాలామంది ప్రేక్షకులు సీక్వెల్ ఉంటుందనే నమ్మకంతోనే ఉన్నారు. అయితే త్వరలోనే ఈ సీక్వెల్ కూడా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. 2023లో అఖండ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అడవి శేష్ హీరోగా వచ్చిన గూఢాచారి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు శేష్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు అడివి శేష్ వెల్లడించారు.
విష్ణు హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల14 ఏళ్ల కింద వచ్చిన ఢీ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇవే కాకుండా రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన 'విక్రమార్కుడు'కి , రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన 'క్రాక్‌'కి , గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వం వహించిన 'లక్ష్యం'కి , తేజ దర్శకత్వం వహించిన 'చిత్రం' మూవీకి సీక్వెల్‌గా 'చిత్రం 1.1', తేజా సజ్జ 'జాంబి రెడ్డి', నవీన్‌ పోలిశెట్టి 'జాతిరత్నాలు, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ', విశ్వక్‌ సేన్‌ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన 'ఫలక్‌నుమా దాస్‌' చిత్రాలకు కూడా సీక్వెల్స్ రాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: