గాయని చిత్ర.. తేనె కన్నా తీయనైన గొంతుతో వేలాది పాటలకు ప్రాణం పోసిన ఈ లెజెండరీ సింగర్‌ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాలుగు దశాబ్దాల సంగీత ప్రయాణంలో 25 వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఆమె కే సొంతం.

భారతీయ భాషలతో పాటు మలాయ్‌, లాటిన్‌, అరబిక్‌, ఇంగ్లిష్‌ ,ఫ్రెంచ్‌ తదితర విదేశీ భాషల్లోనూ తన గాన ప్రతిభను నిరూపించుకున్నారు ఆమె. ఇళయరాజా, ఏ.ఆర్‌.రెహమాన్‌, ఎస్పీబాలసుబ్రమణ్యం, యేసుదాస్‌, హంసలేఖ వంటి సంగీత దిగ్గజాలతో కూడా చిత్ర కలిసి పనిచేశారు. ఇలా సంగీత ప్రపంచంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించి తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు లెజెండరీ సింగర్‌. అయితే ఈమె వ్యక్తిగత జీవితంలో ఓ అనుకోని విషాదం అయితే చోటు చేసుకుంది. అదే తన కూతురు మరణం. చిత్ర విజయశంకర్ అనే ఒక ఇంజనీర్ ని పెళ్లి చేసుకోగా వీరికి నందన అనే ఒక పాప కూడా పుట్టింది. అయితే పాప డౌన్‌ సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడేది. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే మనిషిలో అసలు ఎదుగుదల ఉండదు. నందనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కచేరి లో పాల్గొనడానికి వెళ్లిందట చిత్ర. అదే సమయంలో దురదృష్టవశాత్తూ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి కన్నుమూసిందట నందన. 2011లో ఈ దురదృష్టకర ఘటన జరిగింది.

కాగా ఈ లోకం నుంచి వెళ్లిపోయిన తన కూతురు పేరుమీద ఓ ఛారిటబుల్‌ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను చేస్తున్నారు చిత్ర. కాగా ఇవాళ (డిసెంబర్‌ 18) నందన జయంతి. ఈ సందర్భంగా తన కూతురును గుర్తుకు తెచ్చకుని కాస్త ఎమోషనలయ్యారామె. కూతురి ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఆమె ' 'స్వర్గంలో దేవ కన్యలతో సెలబ్రేషన్స్‌ జరుపుకుంటున్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్నేళ్లు గడిచినా నీ వయసు పెరగదు. నాకు దూరంగా ఉన్నా క్షేమంగా ఉన్నావని నాకు తెలుసు. నిన్ను ఎంతో మిస్ అవుతున్నా. హ్యాపీ బర్త్‌ డే మై డియరెస్ట్‌ నందన' అంటూ ఎమోషనల్ గా రాసిన నోట్‌ను షేర్‌ చేశారు చిత్ర.

మరింత సమాచారం తెలుసుకోండి: