మెగా ఫ్యామిలీలో దాదాపుగా అందరు హీరోలు సక్సెస్ ఫుల్ కెరీర్ ని లీడ్ చేస్తున్నారు. మెగా స్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కూడా ఎలాగోలా హీరోగా ఇండస్ట్రీలో నిలబడేందుకు సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నారు. విజేత మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా అది వర్కవుట్ కాలేదు. రెండో ప్రయత్నంగా సూపర్ మచ్చి అనే సినిమా తీస్తే కరోనా కారణంగా విడుదలకు టైమ్ దొరకడంలేదు. ఈలోపు కిన్నెరసాని అనే మరో మూవీ చేస్తూ బిజీగా మారిపోయారు కల్యాణ్ దేవ్. అయితే సరైన హిట్ కోసం మంచి దర్శకుడిని వెదికే పనిలో పడ్డారు మెగాస్టార్ చిరంజీవి. అల్లుడి కెరీర్ చక్కదిద్దే పనిలో పడ్డారు.

తొలి సినిమా ఉప్పెన తో తన స్టామినా ఏంటో నిరూపించుకున్న బుచ్చిబాబుని మెగా అల్లుడికోసం లైన్లోకి తీసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, వైష్ణవ్ తేజ్ కి మెమొరబుల్ హిట్ ఇచ్చిన బుచ్చిబాబుకి సహజంగానే మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలున్నాయి. అందులోనూ చిరంజీవి ఆదేశిస్తే కాదంటారా. అందుకే ఇప్పుడు మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నారట బుచ్చిబాబు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం బుచ్చిబాబు సిద్ధమవుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత కొరటాల శివతో సినిమా చేసి, ఆ తర్వాత బుచ్చిబాబు వద్దకు వస్తారు ఎన్టీఆర్. అంటే ఈ గ్యాప్ లో ఓ సినిమా చేయడానికి దర్శకుడి దగ్గర కావాల్సినంత సమయం ఉంది. ఈలోగా కల్యాణ్ దేవ్ తో సినిమా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం.

రామ్ చరణ్ కెరీర్ అయినా, అల్లు అర్జున్ కెరీర్ అయినా.. మెల్లగానే పికప్ అయింది. సాయి ధరమ్ తేజ్ కూడా ఇటీవలే హిట్ ట్రాక్ లోకి వచ్చారు. అయితే వైష్ణవ్ తేజ్ మాత్రం వస్తూ వస్తూనే సూపర్ హిట్ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అందుకే కల్యాణ్ దేవ్ కోసం బుచ్చిబాబుని దర్శకుడిగా తీసుకోవాలనుకుంటున్నారు చిరంజీవి. ఈసారి అల్లుడు సినిమా కచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిందేనంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: