ఇక సాధారణంగా హైదరాబాద్ నుంచి మాల్దీవులకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక రెండు మూడు విమానాలు ఎక్క వలసి వచ్చేది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటి నుంచి ప్రయాణికులకు అలాంటి కష్టం ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ మీరు మాల్దీవులకు వెళ్ళాలి అనుకుంటే మీ కోసమే ఈ ఒక శుభవార్త సిద్ధంగా ఉంది. ఇకపై హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవుల్లో ల్యాండ్ అయిపోవచ్చు. హైదరాబాద్ నుంచి మాల్దీవులకు మొదటిసారి ఒక డైరెక్ట్ విమానాన్ని ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభించనున్నట్లు విమాన సంస్థ గో ఏయిర్ తెలిపింది.
వారానికి నాలుగు రోజుల పాటు ఈ సర్వీస్ అందరికీ అందుబాటులో ఉండనుంది. ఇక ఈ విషయాన్ని ప్రముఖ విమానయాన సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. సోమ మంగళ గురు ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి మాల్దీవుల్లో మధ్య సర్వీసులు అందుబాటులో ఉంచేందుకు గోఎయిర్ సంస్థ నిర్ణయించింది. ఇక ఈ మార్గంలో నెక్స్ట్ జనరేషన్ ఎయిర్బస్ a320 నియో ఎయిర్క్రాఫ్ట్ సేవలు అందించనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి G8 1533 ఫ్లైట్ ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాల్దీవుల్లోని వెలానా అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుతుంది. మరోవైపు మాలే నుంచి G8 4033 ఫ్లైట్లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకోవచ్చు.