చిత్తూరు జిల్లా మదనపల్లెలో సొంత కూతుళ్లను తల్లిదండ్రులే చంపిన ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి క్షుద్ర పూజలు అంటేనే వణుకు పుడుతోన్న పరిస్థితి. తాజాగా తెలంగాణ లోని పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేపాయి. నోట్ల వర్షం కురిపిస్తాము అంటూ దంపతులకు మాయమాటలు చెప్పిన ఒక ముఠా డబ్బు ఆశ చూపెట్టి వారి కూతురు తో పూజ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ వ్యవహారం బెడిసి కొట్టడంతో ముఠా అంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఊచలు లెక్క పెడుతుంది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు లోకి వెళితే పెద్దపల్లి జిల్లా చందపల్లి పోలీసుల వివరాల ప్రకారం పెద్దపల్లికి చెందిన రైల్వే ఉద్యోగి, ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఒక టైలర్ షాప్ నిర్వాహకుడు అలానే మరో వ్యక్తి కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు.  బండ తిరుపతికి బాగా ఆస్తి పాస్తులు ఉండడంతో అతడి నుంచి డబ్బులు రాబట్టేందుకు.. క్షుద్రపూజలు చేస్తే ఇంకా బాగా సంపాదించవచ్చని అతడి స్నేహితుడు ఆరేపల్లి రాజేందర్‌ సలహా ఇచ్చాడు. మహారాష్ట్రలోని బాబాలు పూజలు చేస్తారని, నరబలి ఇస్తారని తెలిపాడు. రాజేందర్‌ మాటలు నమ్మిన తిరుపతి క్షుద్ర పూజలకు అంగీకరించాడు. 

దీంతో రాజేందర్‌ తన స్నేహితులైన చందపల్లికి చెందిన ఆర్‌ఎంపీ ఉప్పు కుమార్, అదే గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి మంతెన శ్రీనివాస్‌ను సంప్రదించి బండ తిరుపతి నుంచి డబ్బులు రాబట్టే ప్లాన్ వారికి వివరించాడు. తర్వాత నలుగురూ కలసి క్షుద్రపూజలకు ఏర్పాట్లు చేపట్టారు. పూజలకు ఇద్దరు మహిళలు, ఒక అవివాహిత యువతిని చీకటిగదిలో కూర్చోబెట్టి పూజ చేస్తే కనక వర్షం కురుస్తుందని బాబా వీరిని నమ్మించాడు. దీంతో ఆర్‌ఎంపీ క్షుద్ర పూజల కోసం చందపల్లికి చెందిన తొగరి సరిత, భూతం మల్లమ్మను సంప్రదించాడు. పూజల్లో పాల్గొంటే రూ.2 లక్షల చొప్పున ఇస్తామని నమ్మించాడు. మరో పెళ్లికాని యువతిని తీసుకురావాలని సూచించారు. ఆమెకు రూ.20 లక్షలు, బంగారం ఇస్తామని తెలిపాడు. 

దీంతో తొగరి సరిత, భూతం మల్లమ్మ చందంపల్లికే చెందిన ఆర్కుటి సరితను సంప్రదించారు. అమావాస్య రోజు పూజలు నిర్వహించేందుకు ఆమె కూతురును పంపించాలని కోరారు. ఇందుకు రూ.20 లక్షల నగదు, బంగారం ఇప్పిస్తామని తెలిపారు. అయితే పూజ చేసేందుకు సిద్ధమవుతున్నారు కానీ డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు అమావాస్య నాటికి కూతురుని సిద్ధం చేయాలని ఒత్తిడి తేవడంతో పూజలో నరబలి కూడా ఉంటుందని ఆమెకు అనుమానం కలిగింది. దీంతో విషయాన్ని తన భర్తకు చెప్పింది. ఈ ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే తిరుపతి వద్ద ఉన్న డబ్బులు కాజేసేందుకు ముఠాలో ఉన్న మిగతా వాళ్లు ప్రయత్నించి ఇలా ప్లాన్ చేశారని చివరికి తేలింది. నరబలి లాంటివి చేయడానికి కూడా వీరు వెనుకాడే వారు కాదని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: