సాధువులకు ప్రాంతీయతా?ముందుచూపుతో వ్యవహరిస్తే.. చాలా అంశాలు వివాదాల రూపు సంతరించుకోవు. పాలకుల పుణ్యమా అని.. వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపంగా కొన్ని అంశాలు అనవసరమైన ఉద్రిక్తలకు కారణమవుతాయి. నమ్మకాల విషయంలో ప్రభుత్వం దుచూపుతో వ్యవహరించటం ఉత్తమం. కానీ.. ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదు.తాను తీసుకున్న నిర్ణయాన్ని సవరించుకునే విషయంలో ఆయన ఏమాత్రం పట్టువిడుపులను వదలటం లేదు. రాములోరి కల్యాణాన్ని ఏపీ సర్కారు కడపజిల్లా ఒంటిమిట్టలో నిర్వహించటంపై పలువురు సాధువులు అగ్రహం వ్యక్తం చేస్తూ.. ఉత్తరాంధ్రలోని రామతీర్థంలో చేపట్టాలని చెప్పటం తెలిసిందే.దీనికి వారు చేస్తున్న అభ్యంతరాల్ని చూస్తే.. నవమి కల్యాణం అభిజిత్ లగ్నంలో చేస్తారని.. ఒంటిమిట్టలో మాత్రం రాత్రివేళలో నిర్వహిస్తారని..
ఇది ఏపీకి ఏమాత్రం మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. దీనిపై సాధువులు.. ధర్మపరిషత్ లతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ వివాదానికి ఒక పరిష్కారం సూచించాల్సింది కోరటం కానీ.. ప్రభుత్వ నిర్ణయాన్ని.. దానిపై వినిపిస్తున్న విమర్శల్లో ఏది సరైనదన్న అంశంపై దృష్టి సారించినా బాగుండేది. కానీ.. ఈ విషయంలో బాబు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.తాజాగా.. ఒంటిమిట్టలో కల్యాణం మంచిదేనంటూ మరో గొంతు బయటకు వచ్చింది. తన వాదనను చెప్పుకోవటంలో ప్రతిఒక్కరికి స్వేచ్ఛ ఉంది. కానీ.. ఆ పేరుతో ప్రాంతీయ భావనల్ని లేవనెత్తటం సరికాదు. ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం నిర్వహించటాన్ని సమర్థించే క్రమంలో.. ఉత్తరాంధ్ర సాధువులు అభ్యంతరం వ్యక్తం చేయటం సరికాదంటూ తెలుగు భాషా పరిశోధకులు కట్టా నరసింహులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒంటిమిట్టలో కల్యాణంపై ఉత్తరాంధ్ర సాధువులు నోరు పారేసుకోవద్దని ఆయన హితవు పలుకుతున్నారు. ఒక తప్పును ఎత్తి చూపే క్రమంలో దాన్ని తప్పు అని చెప్పటం వరకూ ఓకే. కానీ.. ఆ పేరుతో ప్రాంతీయ భావనలు తీసుకురావటాన్ని మాత్రం అందరూ ఖండించాల్సిందే. ఇప్పటికైనా ఒంటిమిట్టలో నిర్వహించాలనుకుంటున్న కల్యాణంపై ఎవరైనా పెద్దల్ని సంప్రదించి.. వారి అభిప్రాయాన్ని వెల్లడించి ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేస్తే బాగుంటుందేమో.