2003, ఏప్రిల్ 11వ తేదీన రాత్రి మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజా ఖానా జెహ్రా దారుషిఫా నుంచి ఈ ఆలంను కొందరు దొంగతనం చేశారు. అలా దోపిడీకి గురైన ఆలంను పట్టుకోవడం విఫలమయ్యారు హైదరాబాద్ పోలీసులు. అయితే, ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినా సరియైన ఆధారాలు లభించలేదు దీంతో కేసు మూసివేశారు.
తరువాత నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఈ ఆలం కనిపించగా దీనిపై ఆరా తీయంగా అసలు విషయం బయటపడింది. దొంగిలించిన ఆలంను దుండగులు ఆస్ట్రేలియాకు తరలించారు. అక్కడ పోలీసులకు పట్టుబడటంతో ఆలంను నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఉంచారు. దీని గురించి సమాచారం తెలుసుకున్న ఇండియా గవర్నమెంట్ ఆలంతో పాటు.. దేశానికి చెందిన మరో 14 కళాకృతులను అప్పగించాల్సిందిగా ఆస్ట్రేలియా సర్కార్ను కోరింది. దానికి సానుకూలంగా స్పందించింది భారత్కు వీటిని అప్పగిస్తామని ప్రకటించింది ఆస్ట్రేలియా.
మహ్మద్ ప్రవక్త కుమార్తె బీబీ ఫాతిమా జ్ఞాపకార్థం ఆజా ఖానా జెహ్రాలో 1956 లో ఈ ఆలం ను ఏర్పాటు చేశారు చివరి నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇప్పుడు భారత్ ఈ ఆలం తిరగి వస్తుండడంతో భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఎక్కడ దొంగలించబడిందో అక్కడే ఆ పవిత్ర ఆలం (పీర్) ను ఉంచాలని పలువురు కోరుతున్నారు. దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, వక్ఫ్ బోర్డ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సఫీవుల్లా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.