"ఇప్పటి వరకూ రహదదారులను అభివృద్ధి పరిచాం. ఎంతో వ్యయం చేసి ఈ పనులు చేపట్టాం. కొన్ని పూర్తయ్యాయి. మరి కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి భద్రత పై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. రహదారులు బాగు పడడం మూలంగా ప్రయాణ దూరం తగ్గింది. అదే సమయంలో వేగం పెరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇది చాలా బాధా కరమైన విషయం దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేయాలి" అని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన శాఖ అధికారులకు సూచించారు. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు కోరాలని ఆయన తెలిపారు.
కేంద్ర రవాణా, రహదారుల శాఖ ఈ ఏడాది జూలై 28న జాతీయ రోడ్డు భద్రతా మండలి (ఎన్ఆర్ఎన్ సి)ని ఏర్పాటు చేసింది. ఈ మండలిలో 13 మంది సభ్యులున్నారు. రెండు నెలలకు ఒక సారి ఈ మండలి సమావేశం అవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రాలలోనూ భద్రతా కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి ఉన్న రాష్ట్రాలు క్రమం తప్పకుండా సమావేశాలు జరిగేలా చూడాలని పేర్కోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఎన్ఆర్ఎన్ సి లేఖలు రాసింది.