టీడీపీ అధినేత చంద్ర‌బాబు రెండు రోజుల పాటు కుప్పంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే తొలిరోజు ఆయ‌న ఏపీ స‌ర్కారుపైనా.. సీఎం జ‌గ‌న్‌పైనా విరుచుకుప‌డ్డారు.. ఇక‌, రెండో రోజు.. రైతుల‌తోనూ.. స్థానిక ప్ర‌జ‌ల‌తోనూ మ‌మేక‌మ‌య్యారు.రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సామగుట్టపల్లిలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. పొలాల్లో రైతుల దగ్గరకెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. మద్దతు ధరలేక వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతుకు మద్దతు ధర కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

ఇక‌, తొలిరోజు.. ఏకంగా వైసీపీని క‌డిగిపారేశారు. ద‌మ్ముంటే.. చ‌ర్చ‌ల‌కు రావాల‌ని పిలుపునిచ్చారు. బూతులు ఎవ‌రు మాట్లాడుతున్నారో తేల్చేద్దామ‌న్నారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న‌పై ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని అన్నారు. ఇలా, రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లోనూ చంద్ర‌బాబు దూకుడుగా ముందుకు సాగారు. చంద్రబాబు రాక కుప్పం టీడీపీ శ్రేణుల్లో అమితోత్సాహం నింపింది. ఆయన రోడ్‌షో, బహిరంగ సభకు భారీఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. పలువురు కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు.

అయితే.. మొత్తంగా కుప్పం ప‌ర్య‌ట‌న ద్వారా.. చంద్ర‌బాబు ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఎందుకు ఆయ‌న అనూహ్యంగా కుప్ప ప‌ర్య‌ట‌న‌కు త‌ర‌లి వ‌చ్చారు? అనే చ‌ర్చ టీడీపీలోనే సాగుతుండ‌డంగ‌మ‌నార్హం. దీనిపై రెండు భిన్న‌మైన వాద‌న‌లు ముందుకు వ‌చ్చాయి. ఒక‌టి స్థానిక ఎన్నిక‌ల‌కు కుప్పం రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఇక్క‌డ పోతున్న ఇమేజ్‌ను వైసీపీ దూకుడును క‌ట్ట‌డి చేసేందుకు ఆయ‌న కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నేత‌ల‌ను ఒకే తాటిపై న‌డిపించేందుకు.. నేత‌ల‌కు ధైర్యం చెప్పేందుకు.. వైసీపీ వ్యూహాల‌కు ప్ర‌తి వ్యూహాలు ర‌చించేలా వారిని ముందుకు న‌డిపించేందుకు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి ఉంటారని కొంద‌రు అంటున్నారు.

అదే స‌మ‌యంలో మ‌రో వ‌ర్గం నాయ‌కులు.. మాత్రం.. చంద్ర‌బాబుపై వైసీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు.. ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. అందులో భాగంగానే ఆయ‌న త‌ర‌లివ‌చ్చార‌ని అంటున్నారు. కొన్నాళ్లుగా వైసీపీ నాయ‌కులు.. ఇంకేముంది.. చంద్ర‌బాబు వృద్ఢుడై పోయారు.. సో.. ఇక‌, పార్టీ అచేత‌నం అయిపోతోంద‌ని.. ప్ర‌చారం చేస్తున్నారు. భ‌విష్య‌త్తులోనూ ఈ వాద‌న‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు.. అనూహ్యంగా ఈ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. మ‌రి కుప్పం ప‌ర్య‌ట‌న ద్వారా చంద్ర‌బాబు ఏం చేయాల‌ను అనుకుంటున్నారో తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: