న‌మ్మ‌కాలు విశ్వాసాలు ఎలా ఉన్నా కూడా రాజ గురువుకు మాత్రం అందాల్సిన కానుక‌లు ఎక్క‌డా ఆగ‌కుండా అందుతూనే ఉన్నాయి. హైద్రాబాద్ లో ఆయ‌న ఉన్నా, విశాఖ‌లో ఆయ‌న ఉన్నా ఎక్క‌డున్నా రెండు రాష్ట్రాల పెద్ద‌లూ స్వామికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల‌ను థార్మిక సంస్థ పేరుతో అత్యంత చాక‌చ‌క్యంగా త‌న ఖాతాలో వేసుకున్న ఘ‌న‌త గ‌తంలో ఎన్న‌డూ లేకున్నా ఇప్పుడు మాత్రం ఆయ‌న మాటే వేదం అయి నిలుస్తోంది. అందుకే ఆయ‌న ఎప్పుడూ అటు జ‌గ‌న్ కానీ ఇటు కేసీఆర్ కానీ ఇద్ద‌రూ త‌న‌కు కావాల్సిన వారేన‌ని చెబుతుంటారు. వారి కోసం వారి గెలుపు కోసం త‌న ఆశ్ర‌మంలో ప్ర‌త్యేక పూజ‌లు చేస్తుంటాన‌ని కూడా అంటుంటారు. ఈ పూజ‌లు, నోములు ఎలా ఉన్నా కూడా ప్ర‌జా ప్ర‌భుత్వాలు ఇలా విలువ‌యిన ఆస్తుల విష‌య‌మై ఉదార‌త‌ను చూపించ‌డంపై ఎప్ప‌టి నుంచో చాలా చాలా ఆరోప‌ణ‌లు, వీటితో పాటు కోర్టు కేసులు న‌డుస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో...
ఇవాళ రాజ‌గురువు స్వ‌రూపానందేంద్ర పుట్టిన్రోజు. విశాఖ కేంద్రంగా శార‌దా పీఠం న‌డుపుతున్న ఈ పెద్దాయ‌న ఇప్ప‌టికే ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి కొన్ని వ‌రాలు అందుకు న్నారు. ఇటు ఆంధ్రాలోనూ అటు తెలంగాణలో కూడా వ‌రాలు అందుకున్నారు. ఇటీవ‌లే ఏ పీ క్యాబినెట్ స్వామికి భూముల కేటాయింపు విష‌య‌మై కీల‌క నిర్ణ‌యం ఒక‌టి వెలువ‌రించి విమ‌ర్శ‌ల పాలైంది. అయినా కూ డా జ‌గ‌న్ స‌ర్కారు ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌లేదు. కొత్త‌కోట (విజ‌య‌న‌గ‌రం జిల్లా) లో స్వామికి స్థ‌ల కేటాయింపు చేశారు. అంతేకాదు తెలంగాణ‌లో కూడా స్వామికి అక్క‌డి ప్ర‌భుత్వం భూములు కేటాయించింద‌ని స‌మాచారం. ఈ విధంగా స్వామీజీల సేవ‌లో ఇరు రాష్ట్ర ముఖ్య‌మంత్రులూ త‌రిస్తున్నారు.


విలువ‌యిన భూములు అడిగిందే త‌డ‌వుగా కేటాయిస్తున్నారు అన్న విమ‌ర్శ ఒక‌టి వినిపిస్తున్నా దీనిని ప‌ట్టించుకునే స్థితిలో ఇరు రాష్ట్రాల పెద్ద‌లూ లేరు. ఇక ఇవాళ స్వామీజీ పుట్టిన్రోజు వేడుక‌ల‌కు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి హాజ‌రై కానుక‌లు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా స్వామి కోరిన కోరికేంటో అది నెర‌వేర్చేందుకు ఎంత కాలం గ‌డువు ఇచ్చారో అన్న‌ది ఇప్పుడిక కీల‌కం. దీనిపైనే ఏపీలో చ‌ర్చ న‌డుస్తోంది. స్వామీజీ ఆశీస్సుల‌తోనే తాను ముఖ్య‌మంత్రిని అయ్యానన్న భావ‌న గ‌తంలో ఓ సారి జ‌గ‌న్ చెప్పారు. ఇప్పుడు ఆ ఆశీర్వాద బలం మ‌రో సారి అందాలంటే ఇంకొన్ని వ‌రాలు తీర్చాల్సిందే! అంతేకాదు ఇవాళ ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం ఏంటంటే ఎన్న‌డూ లేని విధంగా శార‌దా పీఠం వ్య‌వ‌స్థాప‌కుడు స్వ‌రూపానందేంద్ర పుట్టిన్రోజున మా శ్రీ‌కాకుళంలో బ్యాన‌ర్లు వెలిశాయి. ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ ప‌లు ప్ర‌క‌ట‌న‌లు స్థానిక పత్రిక‌ల్లో ప్ర‌చురితం అయ్యాయి. ఇంకొక విష‌యం ఏంటంటే జ‌గ‌న్ తో ఏమ‌యినా ప‌నులు చేయించుకోవాలంటే స్వామికి చెబితే చాలు లైన్ క్లియ‌ర్ అయిపోతుంద‌న్న రూమ‌ర్ కూడా ఎప్ప‌టి నుంచో ఆంధ్రావ‌ని వాకిట న‌డుస్తోంది. ఇలాంటి స‌మాంత‌ర ప్ర‌భుత్వాలు ఉన్నంత కాలం ప్ర‌జ‌ల త‌ర‌ఫున మ‌నం ఏం అడ‌గాల‌న్నా భ‌య‌ప‌డి త‌గ్గాల్సిందే అని అంటున్నాయి క‌మ్యూనిస్టు పార్టీలు.



మరింత సమాచారం తెలుసుకోండి:

ycp