రెండు పదవులు, రెండు డజన్ల ఆశావాహులు  పాలమూరు జిల్లాలో హీట్ రాజేశారు. ఆ ఇద్దరికీ మళ్లీ ఛాన్స్ ఇస్తారా..? లేక కొత్త వారికి అవకాశాలు దక్కుతాయా..? పార్టీ ఈక్వేషన్స్ చెబుతున్న దేమిటి..? ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. గడిచిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కూచికుల్ల దామోదర్ రెడ్డి గెలిచారు. కూచి కుల్ల తర్వాతికాలంలో టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇద్దరూ నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారే. ఒకటే సామాజికవర్గం. ఇద్దరిలో ఒకరికి మళ్లీ ఛాన్స్ ఇస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీగా కంటే ఎమ్మెల్యేగా బరిలో దిగడానికి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆసక్తి చూపిస్తున్నట్టు కల్వకుర్తిలో ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇక దామోదర్ రెడ్డి తనకు కాకుండా తన కుమారునికి  అవకాశం కల్పించాలని కోరుతున్నారట. కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరిన సమయంలో టిఆర్ఎస్ పెద్దలు తన కుమారుని రాజకీయ భవిష్యత్తుకు ఇచ్చిన హామీని  గుర్తు చేస్తున్నారట కూచుకుల్ల. ఈ విషయంలో తాజా మాజీల లెక్కలు ఎలా ఉన్నా ఎమ్మెల్సీలుగా ఈ దఫా కొత్తవారికి ఛాన్స్ ఇవ్వచ్చనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఒక వెయ్యి నాలుగు వందలు యాభై ఐదు మంది ఉన్నారు.

 వీరిలో టీఆర్ఎస్ కు చెందిన లోకల్ ప్రజాప్రతినిధులే ఒక వెయ్యి నలభై తొమ్మిది మంది. సింహభాగం ఓటర్లు అధికార పార్టీకి చెందిన వారే కావడంతో రెండు స్థానాల్లో గెలుపు తమదే అని ధీమా గులాబీ పార్టీలో ఉంది. బిజెపి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు బరిలో నిలిస్తే మాత్రం ఓటు హక్కు కలిగిన స్థానిక ప్రజా ప్రతినిధులకు డిమాండ్ పెరుగుతుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, పాలకొల్లు సెగ్మెంట్లకు ఒక్కో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  ఇప్పటివరకు టిఆర్ఎస్ నుంచి పదవీవియోగం దక్కని,పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వర్గాలు, నాయకులు తమకు సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నుంచి ఉమ్మడి  జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్ రావు ఆర్య,బాదామీ శివకుమార్, టిఆర్ఎస్  రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, మక్తల్ నుంచి దేవరి మల్లప్ప, గద్వాల నుంచి గట్టు తిమ్మప్ప, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి  ప్రతాప్ రెడ్డి తదితరులు ఆశావాదులుగా ముందుకు వస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ లు నిధులు, విధులు లేక అసంతృప్తిగా ఉండడంతో ఆ వర్గాలను సంతృప్తి పరిచేందుకు వారిలో ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. మరి ఆశావహుల్లో ఎవరికీ ఛాన్స్  దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: