సీడీఎస్ బిపిన్ రావత్ ను కాపాడేందుకు చివరి క్షణం వరకూ ప్రయత్నించినా వీలు కాలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఆయనను తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో వైపు అయన సతీమణి మధులిక మాత్రం ప్రమాద స్థలంలోనే మరణించారు. ఇక మిగిలిన వారిని గుర్తించడం ఇప్పుడు ఆర్మీ ఉన్నతాధికారులకు సవాల్ గా మారింది. ఇప్పటికే మూడు రోజులు కావడంతో మృతి చెందిన అధికారుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. తమ వారిని చివరి చూపు చూసుకునేందుకు కన్నీటితో ఎదురు చూస్తున్నారు. బంధువులంతా మరణించిన కుటుంబ సభ్యులను మృతదేహం ఎప్పుడొస్తుందని అడుగుతుంటే చెప్పలేక తల్లడిల్లిపోతున్నారు.
త్రిదళాధిపతి బిపిన్ రావత్, మధులిక మృతదేహాలను మాత్రం ఇప్పటికే అంత్యక్రియల కోసం వారి కుటుంబ సభ్యులకు అప్పగించేశారు. అయితే మిగిలిన వారి మృతదేహాల గుర్తింపుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మంటలు పూర్తిగా వ్యాపించడంతో శరీరభాగాలు పూర్తిగా కాలిపోయాయి. మరికొందరి శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో.. డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల డిఎన్ఏ తో సరిపోల్చి.. ఆ తర్వాత సైనిక లాంఛనాల ప్రకారం మృతదేహాలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది.