రాష్ట్ర పర్యటనను ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికేందుకు ఎంపీ బండి సంజయ్, కె.లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వచ్చారు. వీరితో పాటు మాజీ ఎంపీలు జి.వివేక్ వెంకటస్వామి, చాడా సురేష్ రెడ్డి, సీఎం రమేశ్ కూడా ఉన్నారు. మోదీ ఆయా నేతలందరితో అభివాదం చేస్తూ పలకరించారు. పక్కనే ఉన్న ఈటల రాజేందర్ ను బండి సంజయ్ మోదీకి పరిచయం చేశారు.
హుజూరాబాద్ ఎన్నికల్లో జరిగిన హోరా హోరీ పోరులో టీఆర్ఎస్ ను ఓడించారని ప్రధానికి ఈటల రాజేందర్ను బండి సంజయ్ పరిచయం చేశారు. ఈటలను అభినందించిన నరేంద్ర మోదీ అనంతరం బండి సంజయ్ భుజంపై చేయి వేసి మాట్లాడారు. సంజయ్ బండి జీ... ఏం సంగతి? అంతా బాగే కదా అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. ఇక వెళ్లి రానా అంటూ ఆప్యాయంగా బండి సంజయ్ భుజం తట్టారు. అనంతరం అక్కడున్న మిగిలిన నేతలందరికీ అభివాదం చేస్తూ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు.
గతంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సమయంలో ఆయన మోడీని కలవలేదు.. ఈటల చేరిక కూడా సాదా సీదాగా జరిగింది. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా ఈటల రాజేందర్ ఎయిర్పోర్టులో ప్రధాని మోడీని కలిశారు. కేసీఆర్ అధికార బలం, ఆర్థిక బలం ఎదిరించి మరీ హుజూరాబాద్లో నెగ్గిన ఈటల రాజేందర్.. తెలంగాణ బీజేపీలో ఎప్పుడూ ప్రత్యేకమే మరి.