రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సఖ్యతతోనే ఉన్నారు. ఎప్పుడో తప్పితే ఎవ్వరూ ఎవ్వరినీ ఏమీ అనరు. కానీ ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదిమూలం సురేశ్ మాత్రం రాజ్యాంగానికి సంబంధించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి, తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇది కూడా పెద్దగా చెప్పుకోదగ్గ వెర్బల్ అటాక్ అయితే కాదు. కానీ ఇది కూడా తెలంగాణలో బాగానే గుర్తింపునకు నోచుకుని అక్కడి మీడియాలో వచ్చింది. ఆ తరువాత శ్రీకాకుళం లాంటి మారుమూల ప్రాంతాలలో కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఆయనవి అనుచిత వ్యాఖ్యలు అని అంటూనే తక్షణమే ఆయన స్పందించాలని కోరుతున్నాయి. అయినా ప్రాంతాల మధ్య ఇలాంటి వాదోపవాదాలు ఎందుకని? అంటే కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న మాటలు అన్నవి ఇక్కడి వారిని అమితంగా ప్రభావితం చేశాయి. కొంత కోపానికో,ఆవేశానికో కారణం అయి ఉన్నాయి.మరి! ఆందోళనల నేపథ్యంలో కేసీఆర్ తన వ్యాఖ్యల నుంచి వెనక్కు తగ్గుతారా? ఆఖరికి తెలంగాణ కాంగ్రెస్ కూడా ఆయనపై పోలీసు స్టేషన్లలో కేసులు పెడుతోందే! అంతటి చొరవ మిగతా ప్రజా సమస్యలపై కూడా చూపిస్తే ఎంతో బాగుండు కదా! ఏదేమయినా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల సెగ సిక్కోలుకూ చేరుకుంది.అదీ విశేషం.
సమైక్యాంధ్ర ఉద్యమాల తరువాత తెలంగాణ ఏర్పాటు అయ్యాక అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి పెద్దగా ఏ వ్యాఖ్యలూ చేయలేదు ఆంధ్రా ప్రజలు మరియు శ్రీకాకుళం వాసులు.కానీ ఇప్పుడు రాజ్యాంగానికి సంబంధించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా కేంద్రంతోపాటు మిగతా చోట్ల పనిచేస్తున్న అన్ని దళిత సంఘాలు కూడా కేసీఆర్ పై కోపంగా ఉన్నాయి.ఆయనను దూషిస్తున్నాయి.రాజ్యాంగానికి సంబంధించి ఆ విధంగా మాట్లాడడం కారణంగానే కేసీఆర్ తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటున్నారని అంటున్నాయి.
రాజ్యాంగం మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై శ్రీకాకుళం జిల్లాలోనూ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో హిరమండలంలో దళిత హక్కుల పోరాట సమితి నిరసనలు వ్యక్తం చేసింది.ఖబడ్దార్ కేసీఆర్ అంటూ హెచ్చరికలు చేసింది. హిరమండలం బ్యారేజీ సెంటర్ లో సంబంధిత నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన అంటూ, దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానంటూ చెప్పిన కేసీఆర్ స్థాయి మరిచి, అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాజ్యాంగాన్ని రద్దు చేయాలి అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుని పదవులు పొందిన కేసీఆర్ అదే రాజ్యాంగాన్ని తప్పుపట్టడం, అవహేళన చేయడం సబబు కాదని హితవు చెప్పారు.వెంటనే కేసీఆర్ స్పందించి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.