క్షేత్రస్ధాయిలో వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత మరొకరు నరేంద్రమోడి పర్యటనలకు గైర్హాజరవుతున్నారు. ప్రధానమంత్రి తమ రాష్ట్రాలకు వచ్చినపుడు ముఖ్యమంత్రులు హాజరుకావటం లేదంటే అది మోడికి అవమానమనే చెప్పాలి. ప్రధాని పర్యటనల్లో సీఎంలు ఎందుకు పాల్గొనటంలేదు ?





ఎందుకంటే నాన్ బీజేపీ ప్రభుత్వాల విషయంలో కేంద్రప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరిస్తోంది. నాన్ బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా కేంద్రం ఇబ్బందులు సృష్టిస్తోంది. గవర్నర్ల వ్యవహారాలపై సీఎంలు కేంద్రానికి, రాష్ట్రపతికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా ఉపయోగం ఉండటంలేదు. ఆ కోపంతో సీఎంలు మోడి పర్యటనలను బహిష్కరిస్తున్నారు. ప్రధానమంత్రి పర్యటనలను ఇంతమంది ముఖ్యమంత్రులు వ్యతిరేకించటం గతంలో ఎప్పుడూ జరగలేదట. ఇక్కడ సమస్య ఏమిటంటే మోడి బాడీ ల్యాంగ్వేజ్ తో పాటు వ్యవహారశైలిపైన కూడా వ్యతిరేకత పెరిగిపోతుండటం. 





మోడి పర్యటనలను బహిష్కరించటం అన్నది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో మొదలైంది. బెంగాల్లో మమతను ఇబ్బందులు పెట్టడానికి కేంద్రం జగదీప్ ధడ్కర్ ను అడ్డుపెట్టుకున్నది. ఈ విషయాన్ని మమత చాలాసార్లు బహిరంగంగానే ఆరోపించారు. అయినా గవర్నర్ వైఖరి మారలేదు. దాంతో బెంగాల్ కు మోడి వచ్చినపుడు మమత ఎక్కడా కనబడటంలేదు.





బెంగాల్లో మొదలైన వ్యవహారం అక్కడితోనే ఆగకుండా కేరళకు పాకింది. అక్కడి నుండి మహారాష్ట్రకు చేరుకుంది. అక్కడినుండి తెలంగాణాకు వచ్చింది. మధ్యలో పంజాబ్ లో కూడా తొంగిచూసింది. మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానాలను గవర్నర్ తొక్కిపెడుతున్నారు. దాంతో గవర్నర్తో పాటు మోడిపైన మండిపడుతున్న ముఖ్యమంత్రి ఉద్థవ్ థాక్రే మహారాష్ట్రకు మోడి విచ్చినపుడు ఎక్కడా కనబడలేదు. కేరళలో కూడా ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ పట్టించుకోవటంలేదు.





పంజాబ్ లో మోడి పర్యటించినపుడు సాంకేతిక సమస్యల కారణంగా ముఖ్యమంత్రి చన్నీ హాజరుకాలేదు. ఇపుడు తెలంగాణాకు మోడి వచ్చినా కేసీయార్ డుమ్మాకొట్టారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే గవర్నర్లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలను నియంత్రించాలని మోడి చూస్తున్నట్లు అర్ధమైపోతోంది. అందుకనే ముఖ్యమంత్రులు కూడా మోడిపై బాహాటంగానే తిరగబడుతున్నారు. మరి ఈ పరిణామాలు ఎక్కడిదాకా వెళుతుందో చూడాల్సిందే.







మరింత సమాచారం తెలుసుకోండి: