ఎందుకీ బంద్..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలులోకి రావడంతో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. జరిమానాలు పెరిగిపోయాయి. దీంతో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వం నిలుపుదోపిడీ చేస్తోందని డ్రైవర్స్ జేఏసీ మండిపడుతోంది. నూతన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అమలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ ని పరిష్కరించాలని కోరుతూ ఒకరోజు బంద్ కి పిలుపునిచ్చారు. దీంతో అర్థరాత్రి నుంచి ఎక్కడి ఆటోలు అక్కడ, ఎక్కడి క్యాబ్ లు అక్కడ ఆగిపోయాయి.
ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కూడా ఎక్కడికక్కడ బస్సు సర్వీసులన్నీ పూర్తిగా నిండిపోతున్నాయి. దీంతో ప్రజలు అటు క్యాబ్ లు లేక, ఇటు బస్సులు లేక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు తప్పడంలేదు. మార్నింగ్ షిఫ్ట్ ఉద్యోగుల్లో చాలామంది క్యాబ్ సర్వీసులపై ఆధారపడుతుంటారు. అలాంటివారంతా ఇప్పుడు క్యాబ్ లు లేక, ఆటోలు లేక అవస్థలు పడుతున్నారు. మెట్రో ట్రైన్, లోకల్ ట్రైన్స బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నా కూడా ఇబ్బందులు తప్పడంలేదు. వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పెంచుతామంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఒకరోజు బంద్ కావడంతో.. పెద్దగా ఇబ్బంది ఉండబోదని తెలుస్తోంది. రేపటినుంచి యధావిధిగా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఆటోలు, క్యాబ్ లు రోడ్లపైకి రాబోతున్నాయి. అయితే తమ డిమాండ్ ని పరిష్కరించలేకపోతే ముందు ముందు మరిన్ని సార్లు బంద్ చేయడానికి వెనకాడబోమంటున్నారు డ్రైర్ సంఘాల ప్రతినిధులు.