పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికాదని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు అంబటి. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారాయన. ముంపు ఉంటుందనే అంచనాలతోనే ఏడు మండలాలను ఏపీలో కలిపారని, వారికి పునరావాసం అందించాలనే కృత నిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ఉందని చెప్పారు.
పోలవరం విలీన మండలాలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరడం సమంజసం కాదని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. భద్రాచలం ఏపీకి కావాలని అడిగితే ఇచ్చేస్తారా అని ప్రశ్నించారాయన. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ విషయంలో ముందుకు వెళ్తోందని చెప్పారు రాంబాబు. పోలవరం ఎత్తు 3 మీటర్ల మేర పెంచుతున్నారనేవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, అందులో ఏమాత్రం నిజం లేదన్నారు అంబటి రాంబాబు. పోలవరం ఎత్తుపై వివాదం మంచిది కాదని చెప్పారాయన. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, అది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని, అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కష్టసాధ్యమని చెప్పారు అంబటి. ఏపీలోనే కాదు, దేశంలోనే పోలవరం పెద్ద ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్ట్ స్పిల్ వే ద్వారా ఒకేసారి 50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయవచ్చని, ఆ సామర్థ్యం పోలవరం ప్రాజెక్ట్ కి ఉందన్నారు అంబటి. ఎత్తు పెంచుతున్నారనే వార్తల్ని ఆయన కొట్టిపారేశారు.